
హైదరాబాద్: లంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ వరుసగా రెండో టెస్టులోనూ లంకను చిత్తు చేసింది. పల్లెకల్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు అనూహ్యంగా 243 పరుగులకే కుప్పకూలిపోయింది. శనివారం ఒకానొక దశలో మాథ్యూస్ (88) 137 బంతుల్లో 6ఫోర్లతో చెలరేగడంతో 220/5గా కనిపించిన లంక రెండో టెస్టులో గెలుస్తుందనే నమ్మకం కలిగించింది. కానీ, మాథ్యూస్ వికెట్ చేజారడంతో జట్టు పతనం ఆరంభమైంది.
ఒక ఎండ్లో డిక్వెల్లా 43 బంతుల్లో 3ఫోర్లతో (35) నిలకడగా ఆడాడు. కానీ, ఎన్నో ఆశలు పెట్టుకన్న పెరీరా (2), అఖిల ధనంజయ (8 నాటౌట్), లక్ష్మల్ (0), పుష్ప కుమార (1)లు ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయారు. దీంతో.. శ్రీలంకకి 57 పరుగుల తేడాతో వరుసగా రెండో ఓటమి తప్పలేదు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 211 పరుగుల తేడాతో గెలుపొందగా.. నామమాత్రమైన మూడో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి జరగనుంది.
గత బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకి ఆలౌటైంది. అనంతరం శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసి.. 46 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.
రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ జో రూట్ (124: 146 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సు) సెంచరీ చేయడంతో అనూహ్యంగా ఇంగ్లాండ్ 346 పరుగులు చేయగలిగింది. దీంతో.. 301 పరుగుల భారీ టార్గెట్ లంక ముందు నిలవగా.. ఆ జట్టు 243 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్లో కీలక సెంచరీ బాదిన జో రూట్కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. మ్యాచ్ ముగిశాక జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ లంక బాగానే కష్టపడిందంటూ కితాబిచ్చాడు.