సూరత్: సూరత్లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఐదవ టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఐదో మ్యాచ్లో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. చివరి టీ20 శుక్రవారం ఇక్కడే జరగనుంది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కెప్టెన్ హర్మన్ ప్రీత్ దక్కించుకుంది.
PKL7: పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్.. ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి!!
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ సునే లూస్ (7) త్వరగానే పెవిలియన్ చేరింది. లిజెల్ లీ (16), లారా వోల్వార్ట్ (17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత స్పిన్నర్లు రాధా యాదవ్ (3/23), దీప్తి శర్మ (2/19) దెబ్బకు దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. స్పిన్ దెబ్బకు నాడిన్ డి క్లర్క్ (11), మిగ్నాన్ డు ప్రీజ్(10), లారా గూడల్ (15), అన్నే బాష్ (11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వోల్వార్ట్ (17) టాప్ స్కోరర్.
అనంతరం 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 17.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ, స్మృతి మంధనా (7), జెమిమా రోడ్రిగ్స్ (7) తక్కువ పెరుగులకే వెనుదిరిగినా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (34 నాటౌట్) జట్టును ఆదుకుంది. దీప్తి శర్మ (16)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి దగ్గరగా చేసింది. దీప్తి శర్మ ఔట్ అయినా.. హర్మన్ ప్రీత్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించింది. దక్షిణాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (2/19) రెండు వికెట్లు పడగొట్టింది.
మొదటి, నాలుగు, ఐదు టీ20ల్లో భారత్ గెలుపొందగా.. రెండు, మూడు మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. చివరి టీ20 సూరత్లోనే జరగనుంది. దక్షిణాఫ్రికా-భారత్ మహిళా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పు చేసింది. ఈ షెడ్యూల్లో ఐసీసీ అదనంగా మరో టీ20 మ్యాచ్ను చేర్చింది. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దక్షిణాఫ్రికా-భారత్ మహిళల ఐదు టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో.. ఒక టీ20ని షెడ్యూల్లో చేర్చారు.