
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఇటీవలే ముగించుకున్న శ్రీలంక పర్యటన కొంత చేదు అనుభవాలను మిగిల్చింది. వన్డే ఇంటర్నేషన్సల్, టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ఆడిన టీమిండియాలో పలువురు యంగ్ క్రికెటర్లు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. శ్రీలంకలోనే ఐసొలేషన్లో కాలం వెల్లదీశారు. ఐసొలేషన్లో వెళ్లిన వారిలో యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్కు కరోనా వైరస్ సోకినట్టుగా తేలింది. ఇంగ్లాండ్లో ఆ దేశ క్రికెట్ జట్టుతో టెస్ట్ సిరీస్కు ఎంపికైన ఓపెనర్ పృథ్వీ షా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొంతకాలం పాటు ఐసొలేషన్లో గడపాల్సి వచ్చింది. ఫలితంగా వారిద్దరూ తొలి టెస్ట్ మ్యాచ్కు దూరం అయ్యారు.
తొలుత ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన పడగా.. అతని ద్వారా మొత్తంగా ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్కు పరిమితం అయ్యారు. వారిలో కొందరు క్రికెటర్లు కోలుకున్నారు. కరోనా నుంచి రికవరీ అయ్యారు. దీనికంతటికీ ప్రధాన కారకుడైన కృనాల్ పాండ్య కూడా శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చాడు. ఇంటికి చేరుకున్నాడు. తాజాగా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా శ్రీలంక నుంచి ఇంటికొచ్చాడు. అతని నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో వరుసగా మూడుసార్లు నెగెటివ్ రిపోర్టులు రావడంతో ఈ మహమ్మారి నుంచి బయటపడినట్టుగా నిర్ధారించారు. స్వదేశానికి వెళ్లడానికి శ్రీలంక అధికారులు అనుమతి ఇచ్చారు.
దీనితో అతను శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని యజువేంద్ర చాహల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తాను సేఫ్గా ఇంటికి చేరానని పేర్కొన్నాడు. పాజిటివ్ యాటిట్యూడ్తో నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకున్నానని చెప్పాడు. కరోనా బారిన పడ్డ సమయంలో తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఙతలు తెలుపుకొంటున్నానని కామెంట్స్ చేశాడు. తన లేటెస్ట్ ఫొటోను అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. ఇంకొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటానని, అనంతరం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటానని చెప్పాడు.
టెస్ట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన క్రికెటర్లు- ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులన్నీ వచ్చేనెలలో ప్రారంభమౌతాయి. గత ఏడాది తరహాలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేల్స్లో వాటిని నిర్వహించేలా షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. యజువేంద్ర చాహల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన కృనాల్ పాండ్యా ఇప్పటికే ఇంటికి చేరుకున్నాడు. అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడాల్సి ఉంది.
శ్రీలంకలో ముగిసిన టీమిండియా పర్యటన.. మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే ఇంటర్నేషనల్స్లో సిరీస్లో ఆడింది. ఇందులో- వన్డే సిరీస్ను గెలుచుకోగా.. టీ20ని కోల్పోయింది. పలువురు కొత్త ముఖాలతో ఆడిన మ్యాచ్లో భారత జట్టు జట్టు లంకేయుల చేతిలో ఓడిపోయింది. శిఖర్ ధావన్ మినహా మిగిలిన ప్లేయర్లందరూ కొత్తవారే కావడం వల్ల ఓటమి తప్పలేదు. ఐపీఎల్ టోర్నమెంట్లలో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. అది అక్కరకు రాకుండా పోయింది. అంతర్జాతీయ మ్యాచ్లో ఆడుతున్నామనే ఒత్తిడికి వారు గురయ్యారు. ఫలితంగా మ్యాచ్ చేజారింది.