బౌలింగ్ మార్చుకో: ఓకీఫ్ 12వికెట్ల ప్రదర్శనపై ఆసీస్ స్పిన్ కోచ్
హైదరాబాద్: నాలుగు టెస్టుల మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో టెస్టుల్లో టీమిండియా అత్యంత చెత్త రికార్డుని నెలకొల్పడంలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఓకీఫ్ కీలకపాత్ర పోషించాడు. పూణె టెస్టులో 70 పరుగులిచ్చి 12 వికెట్లు తీశాడు.
అయితే తాను పూణె టెస్టులో రాణించడం వెనుక చెన్నైకు చెందిన శ్రీరామ్ శ్రీధరన్ ఉన్నాడని ఓకీఫ్ చెప్పుకొచ్చాడు. ఓకీఫ్ ఇండియా ఏ సిరిస్ (2015) సందర్భంగా తాను చెన్నైలో శ్రీధరన్తో కలిసి పనిచేసినట్లు ఓకీఫ్ చెప్పాడు. ఈ క్రమంలో భారత్కు చెందిన శ్రీధరన్ శ్రీరామ్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్లో శ్రీధరన్ శ్రీరామ్కు పెద్దగా గుర్తింపేమీ లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దాదాపు పది వేల పరుగులు చేసినా, భారత్ తరఫున నాలుగేళ్ల వ్యవధిలో 8 వన్డేలు మాత్రమే ఆడాడు. వీటిలో 81 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే పూణె టెస్టులో ఒకీఫ్ 12 వికెట్లు తీయడంలో తాను చేసేందేమీ లేదన్నాడు.

ఒకీఫ్ బౌలింగ్లో ఒక్కసారిగా ఏమీ మార్పు చేయలేదు
‘ఒకీఫ్ చేసిన సన్నాహాలే అతడికి ఈ ఫలితాన్ని అందించాయి. టెస్టు జరుగుతున్న సమయంలో అతని బౌలింగ్లో నేను ఒక్కసారిగా ఏమీ మార్పు చేయలేదు. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ను మార్చుకోమని ఒకీఫ్కు చెప్పాను. భారత్లాంటి చోట ఒక వ్యూహం పని చేయకపోతే మరో వ్యూహంతో సిద్ధంగా ఉండాలి. భిన్నంగా ప్రయత్నించడానికి కూడా అతను సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాడు. మాకు రెండేళ్లుగా పరిచయం ఉంది' అని శ్రీరామ్ విశ్లేషించాడు.

మనల్ని గౌరవించేందుకు పేరు ప్రఖ్యాతులే ముఖ్యం కాదు
‘మనల్ని గౌరవించేందుకు పేరు ప్రఖ్యాతులే ముఖ్యమని నేను భావించడం లేదు. నేను ఏదైనా అర్థవంతంగా మాట్లాడితే వారు దానిని జాగ్రత్తగా విని స్వీకరిస్తారు. పేరుతో సంబంధం లేకుండా గెలువడానికి మన వద్ద సరైన ప్రణాళిక ఉంటే..ఎవరైనా వినడానికి సిద్ధంగా ఉంటారు. అదే సయయంలో మనం చెప్పే దాంట్లో ఏం లేకపోతే వినేందుకు ఎవరూ ఆసక్తి కనబరుచరు. సమస్య ఏదైనా నేను ఆయా ఆటగాడి దగ్గరికి వెళ్లి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కేవలం స్పిన్నర్లతోనే కాకుండా జట్టు మొత్తంతో మాట్లాడే స్వేచ్ఛను నాకు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ ఇచ్చారు' అని శ్రీరామ్ అన్నాడు.

భారతతో సిరిస్ అంటే ఏ విదేశీ జట్టుకైనా అంత సులువు కాదు
భారతతో సిరిస్ అంటే ఏ విదేశీ జట్టుకైనా అంత సులువు కాదని, అందుకే ఈ సిరిస్కు ముందు దుబాయిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ్ వెల్లడించాడు. ‘ఎలాంటి వ్యతిరేక ఫలితం కోసమైనా మానసికంగా సిద్ధంగా ఉంటే పరాజయాన్ని కూడా స్వీకరించే ధైర్యం వస్తుంది. ఏదైనా చిన్న అవకాశం కలిసొచ్చినా దానిని అందుకోవడం అవసరం. దుబాయిలో మేం వేర్వేరు పిచ్లపై ప్రాక్టీస్ చేశాం. టర్నింగ్, స్లో, లో పిచ్లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాం. ఎలాంటి వికెట్ ఎదురైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని భావించాం' అని శ్రీరామ్ చెప్పాడు.

ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు
ఇక, తమిళనాడు తరఫున సుదీర్ఘ కాలం రంజీల్లో ఆడిన శ్రీరామ్ ఆ తర్వాత అస్సాం, మహారాష్ట్ర, గోవాలాంటి జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరి నిషేధం ఎదుర్కొని, ఆ తర్వాత బయటకు వచ్చాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు.

బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ను అందుకున్న తొలి ఆటగాడు
ప్రతిభకు ప్రోత్సాహంగా ‘బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్'ను అందుకున్న తొలి ఆటగాడు శ్రీరామ్. రెండేళ్ల క్రితం తొలిసారి ఆస్ట్రేలియా ఏ జట్టుతో కలసి పనిచేసిన అతను ఆ తర్వాత సీనియర్ జట్టుతో చేరాడు. శ్రీరామ్ అనుభవాన్ని గుర్తించిన క్రికెట్ ఆస్ట్రేలియా తమ కన్సల్టెంట్గా అతడిని ఎంచుకుంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్గా కూడా పనిచేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications