
పోటీ సమానంగా ఉండేలా
ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో క్యూరేటర్ సిమోన్ లీ మాట్లాడాడు. 'డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికలో జరుగుతుండడంతో పిచ్ను సిద్ధం చేయడం సులువు. ఐసీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. రెండు జట్ల మధ్య పోటీ సమానంగా ఉండేలా మంచి పిచ్ను రూపొందిస్తాం. నా వరకైతే వికెట్లో కొంత వేగం, బౌన్స్ ఉండి బంతి క్యారీ అయితే బాగుంటుంది. సాధారణంగా ఇంగ్లండ్లో వాతావరణం మాకు అంతగా సహకరించదు. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం ముందస్తు అంచనా ప్రకారం వాతావరణం పొడిగా ఉండనుంది. అందుకే వేగంతో కూడిన గట్టి పిచ్ను రూపొందిస్తాం' అని సిమోన్ లీ చెప్పారు.

ప్రతి బంతినీ చూసేలా
'బంతి వేగం సుదీర్ఘ ఫార్మాట్ను రసవత్తరంగా మార్చేస్తుంది. ఒక అభిమానిగా.. క్రికెట్ ప్రేమికులు ప్రతి బంతినీ చూసేలా పిచ్ను రూపొందించాలన్నది మా ఉద్దేశం. ఒకవైపు క్లాస్ బ్యాటింగ్తో పాటు మరోవైపు అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ వీక్షించేలా పిచ్ను తయారు చేస్తాం. బ్యాటర్, బౌలర్.. ఏ ఒక్కరికో కాకుండా అందరికీ అనుకూలించేలా ఉంటుంది' అని క్యూరేటర్ సిమోన్ లీ తెలిపారు. సౌథాంప్టన్ వేదికగా ఈ శుక్రవారం (జూన్ 18) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఆరంభం కానుంది.

అప్పుడే సంతృప్తిగా ఉంటుంది
'పిచ్ ముందుగా సీమర్ల బౌలింగ్కు అనుకూలిస్తుంది. బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకూ వీలుంటుంది. పిచ్పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం లభిస్తుంది. అత్యున్నత స్థాయిలో ప్రతి ఆటగాడు తన ప్రతిభను ప్రదర్శించేలా పిచ్ను అందించాలని అనుకుంటున్నాం. అప్పుడే సంతృప్తిగా ఉంటుంది' అని సిమోన్ లీ చెప్పుకొచ్చారు. క్యూరేటర్ మాటలను బట్టి పిచ్ ఇద్దరికీ అనుకూలించనుంది. అయితే ఇంగ్లండ్ పరిస్థితులు కివీస్ మాదిరే ఉంటాయి కాబట్టి న్యూజిలాండ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

సెంచరీతో చెలరేగిన పంత్
బ్ల్యూటీసీ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా.. బ్యాట్స్మెన్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ మ్యాచులో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్, రోహిత్, జడేజా, సిరాజ్ కూడా సత్తాచాటారు.


Click it and Unblock the Notifications












