వరల్డ్ టెస్టు ఛాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసు రసవత్తరంగా మారింది. భారత్పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో స్థానాలు మారిపోయాయి. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ విజయశాతాన్ని గణనీయంగా కోల్పోయింది. దాదాపు ఆరు శాతం చేజార్చుకుంది.
మరోవైపు ఆసియాలో దశాబ్దం తర్వాత టెస్టుల్లో గెలుపు రుచి చూసిన దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి ఎగబాకింది. 47.62 విజయశాతంతో ఫైనల్ బెర్తు అవకాశాలు మెరుగుపర్చుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి. టాప్-3 జట్లతో పోలిస్తే ప్రస్తుతానికి సౌతాఫ్రికా విజయశాతం తక్కువగా ఉన్నప్పటికీ, తమ తదుపరి మ్యాచ్లు సఫారీలను టేబుల్ టాపర్గా నిలిచేలా ఊరిస్తున్నాయి.

బంగ్లాదేశ్తో దక్షిణాఫ్రికా మరో టెస్టు ఆడనుంది. ఆ తర్వాత సొంతగడ్డపై శ్రీలంక, పాకిస్థాన్లతో రెండేసి టెస్టులు ఆడనుంది. స్వదేశంలో సఫారీలను లంక, పాక్ ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో తమ మిగిలిన మ్యాచ్ల్లో సౌతాఫ్రికా హాట్ ఫేవరేట్గా మారింది. మరోవైపు ఈ మ్యాచ్లన్నీ గెలిస్తే దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. అయిదు మ్యాచ్ల్లో నాలుగు గెలిచినా వాళ్లకు అవకాశం ఉంటుంది. అయితే భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ నేపథ్యంలో భారత్ స్థానం ప్రమాదంలో పడింది. టాప్-2లో నిలిచి ఫైనల్కు చేరాలంటే అయిదు విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం నాలుగు గెలిచి, ఒకటి డ్రా చేసుకున్నా టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే టీమిండియా తమ తదుపరి పోరుల్లో న్యూజిలాండ్తో ఒకటి, ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కంగారూల గడ్డపై రోహిత్ సేన విజయాలు సాధించడం అంత ఈజీ కాదు.
కాగా న్యూజిలాండ్ (44.44), ఇంగ్లండ్ (43.06) అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ (30.56), పాకిస్థాన్ (25.93), వెస్టిండీస్ (18.52) పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. న్యూజిలాండ్ మినహా మిగిలిన జట్లు రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి.