వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఆసక్తికరంగా సాగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి టాప్-2 కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది. అయితే దక్షిణాఫ్రికా తీసుకున్న నిర్ణయం టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. ఇంగ్లండ్పై వైజాగ్ టెస్టు విజయంతో రెండో స్థానానికి దూసుకెళ్లిన భారత్ రెండు రోజుల వ్యవధిలోనూ మూడో స్థానానికి పడిపోయింది.
అసలేం జరిగిదంటే.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్కు చేరింది. ప్రస్తుత ఛాంపియనషిప్లో ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ రెండు విజయాలు సాధించింది. 66.66 గెలుపు శాతంతో, 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు ఆస్ట్రేలియా (55 %; 66 పాయింట్లు), భారత్ (52.77 %, 38 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికాపై విజయంతో కివీస్ పాయింట్ల పట్టికలో టాప్లోకి వెళ్లడం గొప్పగానే ఉంది. కానీ న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా బోర్డు అనుభవం లేని ఆటగాళ్లను పంపింది. 14 మంది జట్టులో సగం మందికి అన్క్యాప్డ్ ప్లేయర్లే ఉన్నారు. కెప్టెన్గా ఎంపికైన నీల్ బ్రాండ్ కూడా అరంగేట్రం చేయని ఆటగాడే కావడం గమనార్హం.
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) కోసం ప్రధాన ఆటగాళ్లను సెలక్ట్ చేయలేదు. దీనిపై సౌతాఫ్రికా బోర్డుపై పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. టెస్టు క్రికెట్ మీద గౌరవం ఉందని, కానీ క్లిష్టమైన షెడ్యూల్తో ఇలా చేయాల్సి వచ్చిందని సౌతాఫ్రికా బోర్డు వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. కానీ, సౌతాఫ్రికా నిర్ణయం ఇప్పుడు టీమిండియా వంటి జట్లపై ప్రభావం చూపనుంది.
ఫిబ్రవరి 13 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులోనూ న్యూజిలాండ్ ఫేవరేట్గా ఉంది. ఆ మ్యాచ్ విజయంతో కివీస్ గెలుపు శాతం ఏకంగా 75కు చేరుతుంది. ఇది టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్ (50 %; 12 పాయింట్లు), పాకిస్థాన్ (36.66 %; 22 పాయింట్లు) టాప్-5లో ఉన్నాయి.