టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. అయితే ఫైనల్లో గేమ్ ఛేజింగ్ మూమెంట్ మాత్రం.. సూర్యకుమార్ యాదవ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్! నరాలు తెగే ఉత్కంఠలో సూర్య కష్టమైన క్యాచ్ను అందుకున్న తీరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఓ వైపు బంతిని గమనిస్తూ.. మరోవైపు బౌండరీ రోప్ను అంచనా వేస్తూ...చిరుతలా పరిగెత్తుతూ సూర్యకుమార్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్సర్గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్పై చాకచక్యంగా అందుకున్నాడు.

ముందుగా సిక్సర్ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. అది సిక్సర్గా మారినా, మిల్లర్ నాటౌట్గా నిలిచినా ఫలితం మరోలా వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాచ్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ అని సూర్యను భారత క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ప్రశంసించారు.
అయితే ఇది ఔట్ కాదని, సిక్సర్ అని దక్షిణాఫ్రికా అభిమానులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీని గురించి సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ స్పందించాడు. గల్లీ క్రికెట్లో బౌండరీ లైన్లో అందుకున్న క్యాచ్ను కొందరు యువకులు పరీక్షించిన తీరును పోస్ట్ చేస్తూ.. ఇదే తరహాలో వరల్డ్ కప్ ఫైనల్లో పరీక్షిస్తే ఫలితం మరోలా ఉండేదని, మిల్లర్ నాటౌట్ అని షంసీ పోస్ట్ పెట్టాడు. దీనికి టీమిండియా అభిమానులు రియాక్ట్ అవ్వడంతో అతను మరో ట్వీట్ చేశాడు.
''నేను చేసిన పోస్ట్ కొందరికి అర్థం కావడం లేదు. ఇది జోక్గా అప్లోడ్ చేశాను. ఇక్కడ ఎవ్వరూ ఏడ్వట్లేదు. నాలుగేళ్ల పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో మళ్లీ చెబుతున్నా.. ఇది జోక్'' అని షంసీ మరో ట్వీట్ పోస్ట్ చేశాడు. సూర్య క్యాచ్ అందుకున్న సమయంలో బౌండరీ రోప్ వెనక్కి జరిగిందని సౌతాఫ్రికా అభిమానుల ప్రధాన ఆరోపణ. దీని గురించి షంసీ పరోక్షంగా స్పందించాడు.