
హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పేసర్ విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సఫారీ బ్యాట్స్మన్ హషీమ్ ఆమ్లాను గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆమ్లా ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
ఇప్పటివరకు ఆమ్లా తన కెరీర్లో గోల్డెన్ డకౌట్ కాలేదు. ఆమ్లాను తొలి బంతికే ఔట్ చేయడానికి బౌలర్లకు 124 టెస్టులు పట్టింది. ఈ మ్యాచ్లో ఫెర్నాండో మూడు వికెట్లు తీసి 62 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకే ఆలౌటైంది.
15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను మార్క్రమ్ (116 బంతుల్లో 60; 9 ఫోర్లు), క్వింటన్ డికాక్ (87 బంతుల్లో 86; 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో (3/62), రజిత (3/67), ధనంజయ డిసిల్వా (2/15) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలిరోజు ఆటముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు చేసింది. లహిరు తిరిమన్నే (25), కసున్ రజిత పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై శ్రీలంక విజయం సాధించిన సంగతి తెలిసిందే.