
హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ (108 బంతుల్లో 121; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించడంతో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. డీ కాక్ సెంచరీతో చెలరేగగా... డసెన్ (50), మిల్లర్ (41 నాటౌట్) ఫరవాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో ఇసురు ఉదనా రెండు, మలింగ, కమిందు మెండిస్, కాసున్ రజిత తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16 ఓవర్లకు గాను 75/2తో ఉన్న సమయంలో వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని 24 ఓవర్లలో 193 పరుగులకు కుదించారు. అయితే, శ్రీలంక 24 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.