
కేప్టౌన్: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 107 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆలౌట్ కావడంతో జట్టు ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక శుక్రవారం నుంచి న్యూలాండ్స్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆ జట్టుకు ఓ సలహా ఇచ్చాడు.
తాజాగా పీటర్సన్ మాట్లాడుతూ... 'తొలి టెస్టులో ఓటమికి పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లను తుది జట్టులో తీసుకోవడమే కారణం. ప్రతీ టెస్టులో వారిద్దరికీ కచ్చితంగా చోటు కల్పించాలనే ఆలోచన మంచిది కాదు. రెండో టెస్టులో ఇంగ్లండ్ గెలవాలంటే ఆ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టాలి. ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఎటాక్ బాగానే ఉంది కాబట్టి అండర్సన్, బ్రాడ్లలో ఒకరికి విశ్రాంతిని ఇవ్వాలి. అప్పుడు ఒక బ్యాట్స్మన్ జట్టులోకి వస్తాడు. లేదా స్పిన్నర్ను ఆడించే అవకాశం ఉంటుంది' అని అన్నాడు.
ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. రెండో టెస్టులో బ్రాడ్, అండర్సన్లలో ఒకరికి విశ్రాంతిని ఇస్తామన్నాడు. ఇదే జరిగితే తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపని అండర్సన్ చోటు కోల్పోయే ఆవకాశం ఉంది. తొలి టెస్టులో జిమ్మీ రెండు వికెట్లు తీస్తే.. బ్రాడ్ 5 వికెట్లు తీసాడు. కోచ్ మాటలను బట్టి చూస్తే స్పిన్నర్ జాక్ లీచ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో లీచ్ తుది జట్టులో ఆడటం దాదాపు ఖాయమైంది.
రెండో టెస్టులో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడటం అనుమానంగా ఉంది. ఒకవేళ ఆర్చర్ ఆడకపోతే.. అండర్సన్, బ్రాడ్లను యథావిధిగా తుది జట్టులో కొనసాగించనున్నారు. తొలి టెస్టుతో అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్ వేదికగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ అండర్సన్కు 150వది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 37 ఏళ్ల అండర్సన్ అందుకున్నాడు.