మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
విజయానందంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. మూడో టీ20లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకుగానూ ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా వేయడంతో.. ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ నిర్ణయం తీసుకున్నారు.
తప్పు అంగీకరించిన మోర్గాన్
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ, వాదనలు ఉండవని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఐసీసీ నిబంధనల ప్రకారం కోత విధించాం. ఓవర్కు 20 శాతం చొప్పున.. ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత వేశాం' అని ఐసీసీ తెలిపింది. ఇక ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారనే విషయం తెలిసిందే.
క్లాసెన్ క్లాస్
మూడో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్లు), తెంబా బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. టామ్ కర్రాన్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మోర్గాన్ విధ్వంసం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్లు), బెయిర్ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడారు. ఇక మోర్గాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో మోర్గాన్, స్టోక్స్ కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో కలిపి 52 పరుగులు చేసారు. అద్భుత ఆటతో ఆకట్టుకున్న మోర్గాన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.