
కేప్టౌన్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డే మ్యాచ్ వాయిదా పడింది. దక్షిణాఫ్రికా జట్టులోని ఓ ఆటగాడికి కరోనా వైరస్ సోకడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మద్య మెుదలు కావాల్సిన తొలి వన్డేను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా పరీక్షల్లో దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మ్యాచ్ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా కూడా ధృవీకరించింది.
శుక్రవారం మ్యాచుకు ముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లకు వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఐసీసీ మ్యాచును వాయిదా వేసింది. ఆటగాడికి వైరస్ సోకినట్టు సీఎస్ఏ స్వయంగా ప్రకటించింది. ఆటగాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక సీఈఓ కుగాండ్రీ గోవెందర్తో పాటు ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ వెల్లడించారు. అలాగే టీమ్లోని ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మెడికల్ టీమ్ సమీక్షిస్తున్నట్లు సీఎస్ఏ తెలిపింది.
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య వాయిదా పడిన మొదటి వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుందని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. ఇక సోమవారమే రెండో వన్డే జరగనుంది. వాస్తవానికి ఈరోజు మ్యాచ్ జరిగితే.. రెండు రోజుల అనంతరం రెండో మ్యాచ్ ఉంది. మ్యాచ్ వాయిదా పడడంతో విశ్రాంతి రోజు జరగనుంది. బుధవారం చివరి వన్డే జరగనుంది.
మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మరో 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. డేవిడ్ మలన్ (99; 47 బంతుల్లో, 11×4, 5×6) విధ్వంసం సృష్టించగా.. జోస్ బట్లర్ (67; 46 బంతుల్లో, 3×4, 5×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. ఫలితంగా మూడు టీ20ల ఇంగ్లీష్ జట్టు సిరీస్ని 3-0తో చేజిక్కించుకుంది.