

హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్టులో చిత్తుగా ఓడిపోయింది. మోర్కెల్ (5/23) రాణించడంతో దక్షిణాఫ్రికా 322 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
నాలుగో రోజైన ఆదివారం 430 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 39.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఓపెనర్లు బాన్క్రాఫ్ట్ (26), వార్నర్ (32) తర్వాత మిచెల్ మార్ష్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేయడం విశేషం. ఒకానొక దశలో 57/0తో ఉన్న ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో మిగతా 10 వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 238/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 311 పరుగులు చేయగా.. ఆసీస్ 255 పరుగులకు ఆలౌటైంది. తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది.
రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సిరిస్లో చివరిదైన నాలుగో టెస్టు మార్చి 30 నుంచి జొహన్నెస్బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది. మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్తో తప్పు చేయించిన స్టీవ్స్మిత్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది.
ఇక, టాంపరింగ్కు పాల్పడిన బాన్క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది. అంతేకాదు బాల్ టాంపరింగ్కు ప్రోత్సహించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో నాలుగో రోజు ఆటలో టిమ్ పెయినీ కెప్టెన్గా వ్యవహరించాడు.
బాల్ టాంపరింగ్ అనంతరం ఆదివారం తిరిగి ప్రారంభమైన నాలుగో రోజు దక్షిణాఫ్రికా అభిమానులు సైతం మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళన చేశారు. ముఖ్యంగా ఉదయం పైన్ నాయకత్వంలో మైదానంలోకి వస్తున్నప్పుడు గట్టిగా అరిచారు. నాలుగో రోజు ఆటకు టికెట్లన్నీ అమ్ముడైనా మూడో వంతు స్టేడియం మాత్రమే నిండింది.
మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ ఓ టేపుతో బాల్ టాంపరింగ్కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంగీకరించిన సంగతి తెలిసిందే.