బ్లోమ్ఫాన్టైన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను కోల్పోయిన దక్షిణాఫ్రికా వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగులుండగానే సఫారీ జట్టు కైవసం చేసుకుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 74 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే శనివారం జరుగనుంది.
టాస్ పడకుండానే సెమీస్ మ్యాచ్ రద్దు.. ఇంగ్లండ్కు షాక్.. తొలిసారి ఫైనల్లో భారత్!!
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (35), అరోన్ ఫించ్ (69)లు మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రొటీస్ పేసర్ లుంగి ఎంగిడి ఓపెనర్ వార్నర్ను ఔట్ చేసి ఈ జంటను విడదీసాడు. ఆపై ఫించ్కు స్టీవ్ స్మిత్ జతకలిశాడు. అయితే స్మిత్ మాత్రం ఆదినుంచి తడబడ్డాడు.
ఈ సమయంలో లుంగి ఎంగిడి మరోసారి విజృంభించాడు. వరుస బంతుల్లో స్టీవ్ స్మిత్ (13), మార్నస్ లాబుషేన్ (0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఒక్కసారిగా ఆసీస్ కష్టాలో పడింది. ఫించ్కు డీఆర్సీ షాట్ (69) జతకలిశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ అనంతరం ఫించ్ ఔట్ అయినా.. డీఆర్సీ అర్థ శతకం నమోదు చేసాడు. మిచెల్ మార్ష్ (36), అలెక్స్ క్యారీ (21)లు మోస్తరుగా ఆడటంతో ఆసీస్ 271 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఎంగిడికి ఆరు వికెట్లు దక్కాయి.
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మలాన్కు స్మట్స్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 91 పరుగులు జోడించారు. ఆపై క్లాసెస్-మలాన్లు సమయోచితంగా ఆడి జట్టు విజయానికి బాటలు వేశారు. మలాన్ (129 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించగా.. క్లాసెస్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. డేవిడ్ మిల్లర్ (37 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.