
హైదరాబాద్: సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన మరింత తీసికట్టుగా తయారైంది. అయితే, ఈ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు గ్రేమ్ స్మిత్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఇందులో భాగంగా ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చింది. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మార్క్ బౌచర్ హెడ్ కోచ్గా, మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్ క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పులు చేశారు.
డిసెంబర్ 26 నుంచి ప్రిటోరియా వేదికగా ఇంగ్లాండ్తో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మొదటి రెండు టెస్టు మ్యాచ్ల కోసం జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్లలో పీటర్ మాలన్, రాసీ వాన్ డెర్ డ్యూసెన్, ఫాస్ట్ బౌలర్లు డేన్ పీటర్సన్, బేరన్ హెండ్రిక్స్, ఆల్ రౌండర్ డ్వయన్ ప్రిటోరిస్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రూడీ సెకెండ్ ఉన్నారు.
భారత్తో సిరీస్లో 0-3తో ఓడిపోయిన జట్టులో ఉన్న ఐదుగురికి చోటు దక్కలేదు. మార్క్రమ్ గాయంతో దూరం కాగా.. డిబ్రుయిన్, సెనురన్ ముత్తుస్వామి, జార్జ్ లిండె, డేన్ పీట్లపై సెలక్టర్లు వేటు వేశారు. కేశవ్ మహరాజ్ రూపంలో సఫారీ జట్టులో ఏకైక స్పిన్నర్ని సెలక్ట్ చేసింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్తో దక్షిణాఫ్రికా మొత్తం నాలుగు టెస్టులు ఆడనుంది.
దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), టెంబా బావుమా, క్వింటన్ డి కాక్, డీన్ ఎల్గర్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, కేశవ్ మహారాజ్, పీటర్ మలన్, ఐడెన్ మార్క్రామ్, జుబైర్ హమ్జా, అన్రిచ్ నార్ట్జే, డేన్ పాటర్సన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, వెర్నాన్ ఫిలాండర్ ప్రిటోరియస్, కగిసో రబాడా, రూడీ సెకండ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్.