దక్షిణాఫ్రికా పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. డర్బన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికీ, అతని ఆర్డినరీ స్లో ఇన్నింగ్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. 62 బంతుల్లో 74 పరుగులు చేసిన రిజ్వాన్.. ఓ దశలో 49 బంతుల్లో 46 పరుగులే చేశాడు.
51 బంతుల్లో అర్ధశతకం సాధించిన తర్వాత గేర్ మార్చి పరుగులు సాధించడం మొదలుపెట్టాడు. ఆలస్యంగా దూకుడు పెంచిన రిజ్వాన్ జట్టును గెలిపించలేకపోయాడు. ఓ ఎండ్లో రిజ్వాన్ టెస్టు ఇన్నింగ్స్ ఆడటం, మరో ఎండ్లో ఉన్న బ్యాటర్లపై ఒత్తిడి పెంంచింది. ఆఖర్లో హిట్టింగ్ చేసిన ఈ పాక్ నయా కెప్టెన్ అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 183 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (82; 40 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. జార్జ్ లిండే (48; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (3/22), అబ్రార్ అహ్మద్ (3/37) చెరో మూడు వికెట్లు, అబ్బాస్ అఫ్రిది (2/30) రెండు, సూఫీ ముఖీమ్ (1/53) ఒక్క వికెట్ తీశారు.
అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (12; 13 బంతుల్లో, 1 సిక్సర్)తో కలిసి మిల్లర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ పాక్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీశారు. ఓ దశలో సౌతాఫ్రికా మిల్లర్తో సహా 136/7 స్కోరే చేసింది. అయితే ఆఖఱ్లో లిండే బౌండరీలతో హోరెత్తించి స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు.
అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. అయితే పాక్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బాబర్ అజామ్ డకౌటయ్యాడు. అయితే సయిమ్ అయుబ్ (31; 15 బంతుల్లో, 7 ఫోర్లు), తయ్యబ్ తాహిర్ (18; 18 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్)తో కలిసి ఓపెనర్ రిజ్వాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రిజ్వాన్ నిదానమైన ఇన్నింగ్స్తో పాక్ 15 ఓవర్లకు 111/4 స్కోరు చేసింది.
17వ ఓవర్ నుంచి షాహిన్ అఫ్రిది (9; 6 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి రిజ్వాన్ దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. కానీ ఒత్తిడిలో పాక్ రెండు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి చిత్తయింది. ఆఖరి ఓవర్లో 19 పరుగులు కావాల్సిన తరుణంలో రిజ్వాన్ రెండో బంతికే పెవిలియన్కు చేరాడు. జార్జ్ లిండే (4/21) నాలుగు వికెట్లు తీశాడు.