
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో పర్యటిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 5న ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు సిరిస్ కంటే ముందే కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓ సరదా సవాల్ ఎదురైంది.
ఆ దేశ పర్యాటక శాఖ షార్క్ డైవింగ్కు విరాట్ కోహ్లీతో భారత జట్టుని ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది. అందులో 'హేయ్.. కోహ్లీ మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ మ్యాచ్ల్ని త్వరలో మేము చూడబోతున్నాం. మైదానంలో ఆ ఆసక్తికరమైన పోరుకి ముందు.. మైదానం వెలుపల ఓ చిన్న సాహసం చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి వచ్చి.. హెర్మనస్లోని షార్క్ డైవింగ్ చేయ్. టీమిండియా ఈ సవాల్కి సిద్ధమేనా?' అని రాసుకొచ్చింది.
దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ చేసిన ఈ ట్వీట్ను ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ దక్షిణాఫ్రికా రీట్వీట్ చేయడం విశేషం. తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న కేప్ టౌన్కు హెర్మనస్ 120.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. హెర్మనస్ టూరిజం వెబ్సైట్ కథనం ప్రకారం అక్కడ మొత్తం 300 వరకు కార్యకలాపాలు జరుగుతాయి.
ఇందులో ముఖ్యమైనవి వేల్ వాచింగ్, షార్క్ కేజ్ డైవింగ్. వీటితో పాటు వాల్కర్ బైకింగ్, ట్రీటాప్ టూర్స్, క్వాడ్ బైకింగ్, గోల్ఫ్ గోర్స్, ఆర్ట్ రూట్ ఉంటాయి. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవని టీమిండియా ఈసారి చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోంది.
ఇందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి నెట్స్లో టీమిండియా కఠినంగా ప్రాక్టీస్ చేస్తోంది. దక్షిణాఫ్రికా సుదీర్ఘ పర్యటనలో భాగంగా సఫారీలతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.