హైదరాబాద్: అంతర్జాతీయ వన్డే కెరీర్కు దక్షిణాఫ్రికా వెటరన్ లెగ్స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే, టీ20ల్లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు.
వరల్డ్కప్ 2019: కెప్టెన్గా కోహ్లీ వద్దు.. ధోని ముద్దు
ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టిన తాహీర్.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్ఏ) గత వారం ప్రకటించిన 2019-20 ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో 39 ఏళ్ల తాహీర్కు చోటు దక్కలేదు. దీంతో తాహిర్ రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
"ప్రపంచకప్లో ఆడాలన్నది నా కోరిక. అందుకే సీఎస్ఏతో పరస్పర అంగీకారం కుదుర్చుకున్నాను. ఆ తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా. జూలై వరకు నా కాంట్రాక్ట్ను పొడిగించాలని దక్షిణాఫ్రికా బోర్డును కోరా. ఇందుకు బోర్డు అంగీకరించింది" అని తాహిర్ చెప్పాడు.
"ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఆడాలనుకుంటున్నాను. అంతేగాక టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ఆడాలన్న కోరిక కూడా నాలో ఉంది. వన్డేలకు వీడ్కోలు పలుకడం బాధగా ఉన్నా.. సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది" అని ఇమ్రాన్ తాహిర్ తెలిపాడు. తాహిర్ 95 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు.