
హైదరాబాద్: సఫారీల ధాటికి ఆస్ట్రేలియా తలొంచింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై తొలి టెస్టు మ్యాచ్లో పైచేయి సాధించింది. ఆసక్తికరంగా ఆరంభమైన మ్యాచ్లో స్టీవ్ స్మిత్ (56) ఆరు బౌండరీలు సాధించాడు. అతనికి తోడుగా డేవిడ్ వార్నర్ సైతం ఆరు బౌండరీలు సాధించి (51) పరుగులు జోడించి హాఫ్ సెంచరీలు చేసినా.. తొలి రోజు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కంగారూల జట్టు నిలబడలేకపోయింది.
వెలుతురులేమి కారణంగా గురువారం ఆట త్వరగా ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. మిచెల్ మార్ష్ (32 నాటౌట్), పైన్ (21 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మైదానం నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఫిలాండర్, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచినా మ్యాచ్ గెలవలేదు:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. ఆ జట్టు 39 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. బాన్క్రాఫ్ట్ (5)ను ఫిలాండర్, ఖవాజా (14)ను రబాడ ఔట్ చేశారు. ఆ దశలో స్మిత్, వార్నర్ నిలిచారు. మూడో వికెట్కు 56 పరుగులు జోడించారు. వార్నర్ను ఔట్ చేయడం ద్వారా బలపడుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఫిలాండర్ విడదీశాడు.
స్మిత్ ఆ తర్వాత మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాన్ మార్ష్ (40)తో నాలుగో వికెట్కు 56 పరుగులు జోడించి మహారాజ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. కాసేపటికే షాన్ మార్ష్ కూడా ఔట్ కావడంతో ఆసీస్ 177/5తో ఇబ్బందుల్లో పడింది. ఐతే మిచెల్ మార్ష్, వికెట్కీపర్ పైన్ ఆ జట్టును ఆదుకున్నారు. అభేద్యమైన ఆరో వికెట్కు 48 పరుగులు జోడించారు.