పాక్ టూర్ వాయిదా:
'మా అంతర్జాతీయ షెడ్యూల్లో పాకిస్తాన్ పర్యటన ఉంది. దాన్ని సాధ్యమైనంత త్వరలోనే నిర్వహిస్తాం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్తో ఆటగాళ్లపై పనిభారం అధికం అయిన కారణంగా పాక్ పర్యటన వాయిదా వేయక తప్పలేదు. పీసీబీ కూడా మా నిర్ణయాన్ని ఒప్పుకుంది. ఈ సిరీస్ ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తాం' అని జాక్వస్ ఫాల్ పేర్కొన్నారు.
అసలు కారణం ఇదేనా?:
భద్రతా కారణాలతో పాకిస్థాన్ వెళ్లేందుకు సఫారీ ఆటగాళ్లు నో చెప్పడంతోనే.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్ని ఆడలేమంటూ పీసీబీకి దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టం చేసినట్టు సమాచారం తెగలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పాక్ గడ్డపై సిరీస్లు ఆడిన విషయం తెలిసిందే. అయితే కీలక ఆటగాళ్లు లేకుండానే లంక జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాక్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
బిజీ షెడ్యూల్:
ప్రస్తుతం ఇంగ్లండ్తో నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరీస్లు ఆడిన దక్షిణాఫ్రికా.. తాజాగా ఇంగ్లీష్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈనెల 16న మూడో మ్యాచుతో టీ20 సిరీస్ ముగుస్తుంది. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. ఆపై వారం వ్యవధిలో మూడు వన్డేల సిరీస్ కోసం సఫారీలు భారత్కు రానున్నారు. ఆ తర్వాత వెంటనే మూడు టీ20ల కోసం పాక్కు వెళ్లాల్సి ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ కారణంగా క్రికెటర్లు తీవ్రంగా అలసిపోతారనే ఉద్దేశంతో ప్రస్తుతానికి పాక్ టూర్కు వాయిదా వేసింది.
ఐపీఎల్ సాకు చూపి:
మార్చి 18న భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ముగుస్తుంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఇక మార్చి 22 వరకూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరగనుంది. పీఎస్ఎల్ నేపథ్యంలో మార్చి 24 నుంచి 28 మధ్య పాక్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20లను నిర్వహించాలని పీసీబీ ప్లాన్ చేసింది. భారత్తో సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికా జట్టు దుబాయ్లో ఉండి.. పీఎస్ఎల్ తర్వాత పాక్కి రావాలని సూచించింది. అయితే ఐపీఎల్ సాకు చూపి.. క్రికెటర్లు బాగా అలసిపోతారని పీసీబీకి దక్షిణాఫ్రికా బోర్డు చెప్పుకొచ్చింది.