
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు అవుతుందనగా.. అన్ని ఫ్రాంచైజీలకు గట్టి షాక్ తగిలింది. సౌతాఫ్రికా ప్లేయర్లంతా ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ఆడటం లేదని తేల్చేశారు. తమ దేశం తరఫున ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆరంభ మ్యాచులకు దూరం అవనున్నారు. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లలోనూ సౌతాఫ్రికా ప్లేయర్లు కీరోల్ పోషిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్లో కీలకమైన డేవిడ్ మిల్లర్ కూడా ఆరంభ మ్యాచులు ఆడటం లేదు.
అతనొక్కడే కాదు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్, కీలక బౌలర్ మార్కో జాన్సెన్ కూడా ఆరంభ మ్యాచులకు దూరం అయ్యారు. నెదర్లాండ్స్తో సౌతాఫ్రికా జట్టు వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ఆడేందుకు వెళ్తుండటంతోనే సఫారీ ప్లేయర్లు ఐపీఎల్కు దూరం అవుతున్నారు. నెదర్లాండ్స్ జట్టు పసికూన అయినప్పటికీ.. వన్డే వరల్డ్ కప్ ముందు ఆడే ప్రతి మ్యాచ్ కీలకం అని భావిస్తున్నందున పూర్తి బలం ఉన్న జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
'ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ క్వాలిఫై అవడానికి ఈ మ్యాచులు చాలా కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా బలమైన జట్టును ఎంపిక చేశాం. మాకంటూ ఒక బాధ్యత ఉంది. దాన్ని పూర్తి చేయాలని కాన్ఫిడెంట్గా ఉన్నాం' అని సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్లో సఫారీలపై నెదర్లాండ్స్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా సౌతాఫ్రికాపై ఉంది.
నెదర్లాండ్స్ పర్యటనకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో.. క్వింటన్ డీకాక్, మార్కో జాన్సెన్, హెన్రిక్ క్లాసెన్, సిసాండ మగల, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడీ, ఆన్రిచ్ నోర్యీ, కగిసో రబాడ, రాసీ వాన్ డర్ డస్సెన్ తదితరులు ఉన్నారు. వీరంతా ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున ఆడుతున్న వారే. దీంతో ఒకరంగా ఈ నెదర్లాండ్స్ సిరీస్.. ఐపీఎల్ జట్లు అన్నింటిపైనా ప్రభావం చూపనుందన్నమాట. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.