సంచలనం.. దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించింది. అబుదాబి వేదికగా సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో సౌతాఫ్రికాపై 69 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-2తో ముగించింది. తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికానే గెలిచింది. నామమాత్రమైన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ ఆల్రౌండ్ షోతో సత్తాచాటింది. వన్డే ఫార్మాట్లో సఫారీ సేనను ఓవరాల్గా రెండోసారి మట్టికరిపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 284 పరుగులు చేసింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. బాల్బిర్నీ (45; 73 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ (34; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో విలియమ్స్ నాలుగు, బార్ట్మన్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు తీశారు.

ఐర్లాండ్ ఓపెనర్లు స్లర్లింగ్, బాల్బిర్నీ ఇన్నింగ్స్ నిదానంగా ఆరంభించారు. తొలుత కుదురుకోవడానికి సమయాన్ని కేటాయించారు. అనంతరం క్రమంగా దూకుడు పెంచి శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఐర్లాండ్ ఓ దశలో సునాయాసంగా 300 మార్క్ను దాటేలా కనిపించింది. కానీ సౌతాఫ్రికా బౌలర్లు పుంజుకుని స్కోరు వేగాన్ని కట్టడిచేశారు. హ్యారీ టెక్టర్ ఆఖరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేశాడు.

అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ (91; 93 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు. ఛేజింగ్లో దక్షిణాఫ్రికాకు శుభారంభమే దక్కలేదు. 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జేసన్ స్మిత్ గొప్పగా పోరాడాడు. సహచరుల నుంచి సహకారం పెద్దగా లభించినప్పటికీ లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. కానీ అతని పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్, గ్రాహమ్ చెరో మూడు వికెట్లు, మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశారు.