జోహెనస్బర్గ్: మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి రోజుకు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం అమెరికా, ఇటలీ, జపాన్, యూరప్ దేశాలలో ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 50 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అనేక దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి.
కరోనాపై పోరు కోసం.. 40 మంది క్రీడా ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్!!
వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం కూడా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ లిజెల్లీ లీ వివాహం నిలిచిపోయింది. తన ప్రియుడు తాంజా క్రోనేతో ఏప్రిల్ 10న లిజెల్లీ లీ వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్లో అది 15వ రోజుగా ఉండడంతో.. వివాహం నిలిచిపోయింది. లాక్డౌన్ కారణంగా లీ ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద వ్యవసాయ పట్టణం అయిన ఎర్మెలాలో ఉంటుంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది.
తాజాగా 28 ఏళ్ల లిజెల్లీ లీ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు మంచి స్థితిలో ఉంది. ఎలాంటి జట్టుకూ భయపడం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో మాకు ఆడాలని ఉంది. అత్యుత్తమ జట్టును ఓడించి తమ సత్తా ఏంటో చాటాలనుకుంటున్నాం' అని తెలిపింది. ఒకవేళ కరోనా ప్రభావం లేకుంటే దక్షిణాఫ్రికా.. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20 పూర్తి చేసుకునేది.
ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెమీస్ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే వర్షం దక్షిణాఫ్రికా ఫైనల్ ఆశలను చిదిమేసింది. లిజెల్లీ లీ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్, 82 వన్డేలు, 74 టీ20లు ఆడింది. వన్డేల్లో రెండు, టీ20లలో ఒక సెంచరీ చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో లిజెల్లీ ఇంట్లో వంట చేస్తూ.. పజిల్ గేమ్ ఆడుతూ గడుపుతోంది.