IND vs SA: రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియాను సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీల సహాయంతో భారత్ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఈ లక్ష్యాన్ని ఛేదించారు.
రికార్డులు సమం
రాయ్పూర్లో దక్షిణాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టుపై విజయవంతంగా ఛేదించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2019లో మొహాలీలో ఆస్ట్రేలియా భారత్పై 359 పరుగులు ఛేదించిన రికార్డును దక్షిణాఫ్రికా సమం చేసింది.భారత గడ్డపై 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన చరిత్రలో రెండో విదేశీ జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

భారత గడ్డపై అత్యధిక విజయవంతమైన వన్డే రన్ ఛేజ్లు:
360 -భారత్ vs ఆస్ట్రేలియా- జైపూర్, 2013
359 -ఆస్ట్రేలియా vs భారత్ -మొహాలీ, 2019
359- దక్షిణాఫ్రికా vs భారత్- రాయ్పూర్, 2025
351-భారత్ vs ఆస్ట్రేలియా- నాగ్పూర్, 2013
351 -భారత్ vs ఇంగ్లాండ్ -పూణే, 2017
కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృథా
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, విరాట్ కోహ్లీ 53వ వన్డే సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ తొలి సెంచరీ, కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ల సహాయంతో 358/5 భారీ స్కోరు సాధించింది. కోహ్లీ, రుతురాజ్ 195 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే భారీ మంచు (Heavy Dew) కారణంగా భారత బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీసినా 79 పరుగులు సమర్పించుకున్నాడు.
మార్క్రమ్ మెరుపులు
దక్షిణాఫ్రికా ఛేదనలో ఐడెన్ మార్క్రమ్ అద్భుతమైన 110 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. అతనికి డెవాల్డ్ బ్రెవిస్ (54), మ్యాథ్యూ బ్రీట్జ్కే (68) అద్భుతమైన సహకారం అందించారు.చివర్లో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు తీసి భారత్ను మ్యాచ్లోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, కోర్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ ప్రశాంతంగా ఆడి నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేశారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ శనివారం విశాఖపట్నంలో జరగనుంది.