హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ శ్రీలంకతో మిగతా సిరిస్కు దూరమయ్యాడు. ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేందుకు డైవింగ్ చేయడంతో అతని భుజానికి గాయమైంది.
దీంతో పరిమిత ఓవర్ల సిరీస్లోని మిగతా మ్యాచ్లకు డుప్లెసిస్ దూరమయ్యాడు. డుప్లెసిస్ గాయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. జట్టు మేనేజర్ మహ్మద్ ముసాజే మాట్లాడుతూ "క్యాచ్ పట్టే క్రమంలో డుప్లెసిస్ కుడి భుజానికి గాయమైంది. దురదుష్టవశాత్తు టూర్లో మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడు" అని తెలిపారు.
డుప్లెసిస్ పూర్తిగా కోలుకునేందుకు కనీసం 6 వారాల విశ్రాంతి అవసరమని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 3-0తో ఆధిక్యం సంపాదించింది. ఈ సిరిస్లో భాగంగా నాలుగో వన్డే ఇరు జట్ల మధ్య బుధవారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐదు వన్డేల సిరిస్ అనంతరం ఆగస్టు 14న కొలంబో వేదికగా ఇరు జట్లు ఏకైక టీ20 జరగనుంది.