మరో 32 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ మహా సమరానికి దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని మంగళవారం వెల్లడించింది. భీకర బ్యాటర్లు, స్టార్ ఆల్రౌండర్లు, యువకులతో సౌతాఫ్రికా టీమ్ డేంజరెస్గా కనిపిస్తోంది.
టీ20 కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న తర్వాత మార్క్రమ్కు ఇదే తొలి మెగా టోర్నీ. అయితే జట్టు ఎంపికలో కొన్ని సాధారణ, మరికొన్ని అసాధారణ విషయాలు ఉన్నాయి. ఊహించినట్లుగానే టీ20 వరల్డ్ కప్తో అన్రిచ్ నోకియా అంతర్జాతీయ క్రికెట్లో పునరామనం చేయనున్నాడు. గాయం కారణంగా తొమ్మిది నెలలు ఆటకు దూరమై ఇటీవల కోలుకున్న అతన్ని ప్రపంచకప్కు ఎంపిక చేశారు.

సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తాచాటిన ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ర్యాన్ రికెల్టన్, ఒట్నియల్ బార్ట్మన్లను వరల్డ్ కప్కు సెలక్ట్ చేశారు. SA 20లో MI కేప్ టౌన్కు ప్రాతినిథ్యం వహించిన రికెల్టన్ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా నిలిచాడు. 58 సగటు, 173 స్ట్రైక్రేట్తో 530 పరుగులు చేశాడు. మరోవైపు సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున ఆడిన బార్ట్మన్ ఎనిమిది మ్యాచ్ల్లో 18 వికెట్లతో సత్తాచాటాడు.
అయితే గత టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న మాజీ కెప్టెన్ టెంబా బవుమా, రొసొవ్, వేన్ పార్నెల్కు ఈ సారి సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అలాగే రీఎంట్రీ ఇవ్వాలనుకున్న డుప్లెసిస్కు నిరాశే మిగిలింది. 15 మందితో పాటు ఇద్దరు రిజర్వ్ ప్లేయర్ల నాంద్రే బర్గర్, ఎంగడిను సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. కాగా, జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
సౌతాఫ్రికా టీమ్: ఎయిడెన్ మార్క్ (కెప్టెన్), బార్ట్మన్, గెరాల్ట్ కొయెట్జీ, క్వింటన్ డికాక్, ఫొర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జేన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, రికెల్టన్, షంసీ, ట్రిస్టన్ స్టబ్స్
ట్రావెలింగ్ రిజర్వ్: బర్గర్, ఎంగిడి.