హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఏదో ఒక రోజు పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి అవుతాడని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఢిల్లీలో గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించాడు.
ఈ కార్యక్రమానికి హాజరైన సెహ్వాగ్ మాట్లాడుతూ 'దాదా(గంగూలీ) ఏదో ఒక రోజు కచ్చితగా పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి అవుతాడని వంద శాతం నమ్మకంతో చెబుతున్నా. అంతకంటే ముందు అతడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తాడు' అని అన్నాడు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్ మాట్లాడుతూ 'నా క్రికెట్ కెరీర్ విజయవంతం అవ్వడంలో గంగూలీ కీలకపాత్ర పోషించాడు. ఒకసారి నేను జట్టులోకి రాగానే దాదా 'చాన్నాళ్ల తర్వాత భారత జట్టుకు మంచి ఫీల్డర్ దొరికాడు' అని అన్నాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు' అని వెల్లడించాడు.
'ఒకానొక దశలో నేను స్పిన్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడేవాడిని. ఆ సమయంలో గంగూలీ నాకు అండగా నిలిచాడు. ఎందుకంటే నేను మ్యాచ్ విన్నర్ అన్న సంగతి అతనికి తెలుసు' అని యువరాజ్ సింగ్ అన్నాడు. ఇక తాను కెప్టెన్గా ఉన్నప్పుడు సెహ్వాగ్, యువీ, హర్భజన్ సింగ్లకు మద్దతు పలకడంపై గంగూలీ ఈ సందర్భంగా వివరించాడు.
'యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, భజ్జీ ఎంతో ప్రతిభ గల ఆటగాళ్లు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ముందుగా వారి వైఫల్యాల వల్ల కలిగే భయాల్ని దూరం చేయలనుకున్నాను. ఎందుకంటే జట్టులోకి వచ్చిన కొత్తలో నేను కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాను' గంగూలీ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు సెహ్వాగ్ను వద్దనడంపై కూడా గంగూలీ స్పందించాడు. '2001లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టులో సెహ్వాగ్ను ఎంపిక చేయడం లేదని సెలక్టర్లు చెప్పారు. ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాడు. అందుకే వద్దంటుకున్నాం అని అన్నారు. కానీ, దీనికి నేను ఒప్పుకోలేదు' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
'దీంతో వారు ఆ పర్యటనకు సెహ్వాగ్ను ఎంపిక చేయక తప్పలేదు. సపారీ గడ్డపై జరిగిన మొదటి టెస్టులో సెహ్వాగ్కు చోటు కల్పించాను. ఈ మ్యాచ్ ద్వారానే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లోనూ సెహ్వాగ్ సెంచరీ నమోదు చేశాడు. నా నమ్మకాన్ని నిలబెట్టాడు' అని గంగూలీ అన్నాడు.