ఆదాయంలో భారీ కోత:
ఓ మూడేళ్ళ క్రితం వరకు ప్రపంచ క్రికెట్లోని అన్ని బోర్డుల కంటే ఐసీసీ నుంచి బీసీసీఐ భారీ రెవెన్యూను తీసుకునేది. ఇక నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో బీసీసీఐ ఆదాయంలో భారీగా కోత పడింది. 2016 నుంచి 2023 వరకు బీసీసీఐ 293 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకోనుంది. ఇప్పుడు ఇదే అంశంపై బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టి పెట్టబోతున్నాడు. తమ వాటా ప్రకారం బీసీసీఐకి రావాల్సింది ప్రస్తుతానికి రెట్టింపు ఉంటుందని గంగూలీ అంటున్నాడు.
బీసీసీఐకి దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందే:
సోమవారం నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ... 'గత కొన్నేళ్లుగా ఐసీసీ నుంచి బీసీసీఐకి రావాల్సినంతగా డబ్బు రావడం లేదు. ఇప్పుడొచ్చేదానికన్నా ఎక్కువ డబ్బు మాకు వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఐసీసీకి వచ్చే మొత్తం ఆదాయంలో భారత్ నుంచే 75-80 శాతం వెళుతుంది. దీనికి తగ్గట్టుగానే బీసీసీఐకి కూడా ఆదాయాన్ని పంచాలి' అని గంగూలీ అన్నాడు.
పునర్వైభవం తెస్తా:
'చాలా గొప్పగా ఫీలవుతున్నా. దేశం తరఫున ఆటగాడిగా, కెప్టెన్గా వ్యవహరించా. మెరుగైన పరిస్థితుల్లో లేని 'బీసీసీఐ' అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నా. బోర్డు ప్రతిష్ఠ మసకబారింది. బోర్డుకు మంచి చేయడానికి నాకు ఇదో మంచి అవకాశం. బోర్డులోని ఎనిమిది మంది సమిష్టిగా ముందుకు సాగి బీసీసీఐకి పునర్వైభవం తెస్తాం' అని గంగూలీ అన్నాడు.
ఫస్ట్క్లాస్ క్రికెటర్లే తొలి ప్రాధాన్యం:
'ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే తొలి ప్రాధాన్యం. గతంలోనే ఈ విషయాన్ని సీఓఏకి తెలిపా. కానీ పట్టించుకోలేదు. ఫస్ట్క్లాస్ క్రికెటర్ల రెమ్యునరేషన్లు కచ్చితంగా పెరగాలి. నేను చేసే మొదటిపని అదే. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన సమస్యగా మారింది. క్రికెట్ కోసం గొప్ప ఆటగాళ్లను ఎలా వినియోగించుకోవాలో సరిగ్గా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వారు వేరే పదవుల్లో ఉన్నారు. ఏ నియామకం జరిగినా సమస్య తలెత్తుతున్నది. ఏజీఎం తర్వాత కొత్త ఉప కమిటీల నియామకం జరుగుతుంది. కొత్త సెలెక్షన్ కమిటీని నియమిస్తాం' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.