
కోల్కతా: మరో మూడు జన్మలెత్తినా క్రికెట్ ఆడాలనుకుంటున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. బుధవారం ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ చిత్రాన్ని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆటకు గుడ్ బై చెప్పిన అనంతరం కోల్కతా క్రికెట్ కోసం దాదా ఎంతో సేవ చేశారు. క్యాబ్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. ఆపై బీసీసీఐ పీఠం అధిష్టించి.. భారత క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
భారత జెర్సీలో క్లాసిక్ లాఫ్టెడ్ షాట్ ఆడుతున్న తన ఫొటోను తాజాగా సౌరవ్ గంగూలీ పోస్టు చేశారు. 'మరో మూడు జన్మల్లోనూ.. నేనిదే చేయాలని అనుకుంటున్నాను' అని దాదా ట్వీట్ చేశారు. తన తర్వాతి మూడు జన్మల్లోనూ టీమిండియాకే ఆడాలని ఇలా దాదా తన మనసులోని కోరికను బయటపెట్టారు. 2007లో పాక్పై దాదా చివరి వన్డే ఆడారు. 1992 నుంచి 2008 వరకు దాదా 424 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. 41.46 సగటుతో 18575 పరుగులు చేశారు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. ఇక 132 వికెట్లు కూడా పడగొట్టారు. కెరీర్లో 228 మ్యాచుల్లో సారథ్యం వహించారు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశారు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్లాడిన దాదా.. 106.81 స్ట్రైక్రేట్తో 1349 పరుగులు చేశారు. బౌలర్గానూ ఇంటర్నేషనల్ క్రికెట్లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడుగా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీకి గత జనవరిలో గుండెనొప్పి రావడంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే. జనవరి 2న దాదాకు చాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు వాటిని తొలగించి యాంజియోప్లాస్టీ చేశారు. తర్వాత డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. మరోసారి చాతిలో ఇబ్బందిగా అనిపించడంతో మళ్లీ పరీక్షించిన వైద్యులు రెండోసారి యాంజియోప్లాస్టీ చేశారు.