నాకౌట్ ఫీవర్ నుంచి బయటపడాలి:
కోల్కతాలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ... ' భారత్ పటిష్ట జట్టు. కోహ్లీ సారథ్యంలో జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోంది. అయితే ఐసీసీ టోర్నీలు మాత్రం గెలువడం లేదు. ఐసీసీ టోర్నీ గెలిచి దాదాపు ఆరేళ్లు అవుతోంది. సెమీఫైనల్, ఫైనల్ తప్ప టోర్నీ అంతా భారత్ బాగా ఆడుతోంది. నాకౌట్ మ్యాచ్ల్లో ఓడిపోయే ట్రెండ్ను మార్చాలి. నాకౌట్ ఫీవర్ నుంచి బయటపడి విజేతగా నిలవాలి' అని దాదా పేర్కొన్నాడు.
కోహ్లీ ఓ చాంపియన్ ప్లేయర్:
'కోహ్లీ సారథ్యంలోని జట్టు నాకౌట్ ఫీవర్ని మారుస్తుందని ఆశిస్తున్నా. కోహ్లీ ఓ చాంపియన్ ప్లేయర్. అతడి సారథ్యంలో మన జట్టు మరింత మెరుగ్గా రాణించి విజయాల్ని సొంతం చేసుకుంటుంది' అని గంగూలీ ధీమా వ్యక్తం చేసాడు. ధోని సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలువలేదు. స్వదేశంలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో విండీస్పై.. 2017 చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్లో టీమిండియా నాకౌట్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
జీవితంలో కొన్ని తక్కువగా ఉంటేనే బాగుంటుంది:
ప్రతి మూడేళ్లకోసారి వన్డే ప్రపంచకప్, ప్రతి ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించాలన్న ఐసీసీ ఆలోచనలపైనా గంగూలీ స్పందించాడు. 'ఆ నిర్ణయం ఐసీసీ తీసుకోవాలి. ఈ ప్రతిపాదనలపై జరిగే చర్చల్లో అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా మాట్లాడుతా. కొన్ని సందర్భాల్లో జీవితంలో కొన్ని తక్కువగా ఉంటేనే బాగుంటాయనిపిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఫుట్బాల్ ప్రపంచకప్ నాలుగేళ్లకోసారి జరుగుతుంది. జనాలు ఎంత పిచ్చిగా చూస్తారో అందరికీ తెలిసిందే' అని దాదా అన్నాడు.