
హైదరాబాద్: ఈరోజు భారత క్రికెట్లో నిజంగానే ఓ అద్భుతం జరిగింది. విజయం సాదించకపోవచ్చు కానీ.. అంతకుమించిన గెలుపు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఆసీస్ గడ్డపై ఆ దేశ పేసర్లను ఎదుర్కొని.. నాలుగో ఇన్నింగ్స్లో ఏకంగా 131 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించడం అసాధారణమే. అసలు ఆశలే లేని సమయంలో పట్టు వదలకుండా ఇండియన్ బ్యాట్స్మెన్ పోరాడిన తీరు అద్భుతం. భారత్ పోరాడిన తీరు చూస్తే.. సిడ్నీ టెస్టులో రహానే సేనదే నైతిక విజయమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అంత గొప్పగా పోరాడింది భారత జట్టు. టీమిండియా పోరాట స్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
'టెస్టు క్రికెట్ ఆసక్తిగా ఉండదని ఎవరన్నారు?. టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలు, కీలక ఆటగాళ్లు దూరమవ్వడం, ఇతర ప్రతికూలతల్లో మరోసారి గొప్ప ప్రదర్శన చేసింది. రిషబ్ పంత్ సెంచరీ సాధించకపోయినా.. గర్వించదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడైన ఆటతో జట్టును పోటీలోకి తీసుకువచ్చాడు' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
'భారత జట్టులో పుజారా, పంత్, అశ్విన్ ఎంత కీలకమో ఇప్పటికైనా అర్థమైందని ఆశిస్తున్నా. నాణ్యమైన బౌలర్లకు వ్యతిరేకంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. ఇక దాదాపు 400 వికెట్లు పడగొట్టడం ఆషామాషీ కాదు. భారత ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. ఇక సిరీస్ గెలవాల్సిన సమయం ఆసన్నమైంది' అని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.
'టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. రిషభ్ పంత్, చెతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి ప్రధాన పాత్ర పోషించారు. గొప్పగా ఆడారు. ఈ జట్టు డ్రెస్సింగ్ రూమ్ అత్యుత్తమం' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీటారు.
'దెబ్బ అదుర్స్ అబ్బా (పంత్ క్రీజులో ఉన్నంత వరకు). సాహసాలు కచ్చితంగా లేవు (పుజారా, విహారి, అశ్విన్ బ్యాటింగ్). ఈ రెండు వ్యూహాలతో ఇదో గొప్ప టెస్టు మ్యాచ్గా నిలిచింది. భారత జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. తనని ఎందుకు ప్రత్యేకంగా పరిగణించాలో పంత్ అందరికీ చాటిచెప్పాడు. విహారి, పుజారా, అశ్విన్ చూపించిన పట్టుదలను చూస్తే నమ్మశక్యంగా లేదు' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.
'భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గొప్పగా సాగుతోంది. ఈ రోజు జరిగిన ఆట సూపర్. భారత్ ప్రదర్శన అద్భుతం. సిడ్నీలో ఇరు జట్లు గొప్ప పోరాట పటిమ చూపించాయి' అని ఆసీస్ మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నారు.
'గాయపడి ఉండొచ్చు.. విశ్వాసం కోల్పోయి ఉండవచ్చు.. కానీ వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పుడూ వెనుకబడలేదు. ప్లేయర్స్ చివరి వరకూ పోరాడిన తీరు చాలా సంతోషం కలిగించింది' అని భారత కెప్టెన్ అజింక్య రహానే ట్వీట్ చేశాడు.
'ఐదవ రోజున భారత్ ప్రదర్శించిన పోరాటం, పట్టుదల అద్భుతం. పంత్, పుజారాలు భారత్కు స్టార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత విహారీ, అశ్విన్లు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రోజంతా టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ను తమ స్వాధీనంలో ఉంచుకోవడం అనిర్వచనీయం. ఇక బ్రిస్బేన్లో జరిగే నాలుగవ టెస్టు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ట్వీట్ చేశారు.