ధోనీతో మాట్లాడుతా:
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక అక్టోబర్ 24న భారత సెలక్టర్లతో గంగూలీ సమావేశం కానున్నాడు. ఈ సందర్భంగా గంగూలీ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'అక్టోబర్ 24న సెలక్టర్లతో సమావేశమవుతా. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు అభిప్రాయాలను తెలుసుకుంటా. అనంతరం ధోనీతో కూడా స్వయంగా మాట్లాడి.. అతడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుంటా' అని అన్నాడు.
ధోనీ విషయాల గురించి తెలియదు:
'ఇంతకుముందు నేను బీసీసీఐ బోర్డులో లేనందువల్ల ధోనీ విషయాల గురించి పూర్తిగా తెలియదు. అందుకే సెలక్టర్లు, ధోనీలతో విడివిడిగా సమావేశం అవుతా. వారి అభిప్రాయాలను విన్నాక నా అభిప్రాయాన్ని వెల్లడిస్తా. సమావేశానికి సెలక్టర్లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హాజరవుతాడు. నిబంధనల కారణంగా సమావేశంలో కోచ్ రవిశాస్త్రి ఉండరు' అని గంగూలీ తెలిపాడు.
క్రికెట్కు తాత్కాలిక విరామం:
ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు కూడా అందుబాటులో లేడు. నవంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.
ధోనీ సెలక్టర్లకు ఏం చెప్పాడు:
ప్రస్తుతం ధోనీ పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లే ఉంది. ఒకవైపు మ్యాచ్లు ఆడటం లేదు.. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. తాను ఆడాలనుకునే సిరీస్లు తనే ఎంపిక చేసుకుంటున్నాడు. ధోనీ సెలక్టర్లకు ఏం చెప్పాడో వారికి మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని వారు బయటికి చెప్పడం లేదు. మరోవైపు కెప్టెన్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో గంగూలీ స్పష్టత తీసుకురానున్నాడు.