1992లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం
1992లో బ్రిస్బేన్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన వన్డే మ్యాచ్లో సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో దాదా కేవలం 3 పరుగులే చేశాడు. ఆ తర్వాత గంగూలీపై "అహంకారి" అని ముద్రపడింది. దీంతో భారత జట్టు నుండి తొలగించబడ్డాడు. తిరిగి జట్టులోకి రావడానికి నాలుగు సంవత్సరాలు వేచి చూశాడు. ఆ తర్వాత దేశవాళీ సీజన్లో భారీగా పరుగులు చేయడంతో 1996లో ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్టర్లు అతడిని జట్టులో ఎంపిక చేశారు.
1996 అరంగేట్ర టెస్టులో సెంచరీ
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో గంగూలీ సెంచరీ సాధించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన రాహుల్ ద్రవిడ్ సైతం సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి కాలంలో వీరిద్దరూ టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించారు. టీమిండియా అందించిన అత్యుత్తమ ఆటగాళ్లుగా నిలిచారు.
2000లో కెప్టెన్గా ఎంపిక
2000 భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి సంవత్సరం. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్ను ఓ కుదుపు కుదిపింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన అజహరుద్దీన్, అజయ్ జడేజా, అజయ్ శర్మ లాంటి ఆటగాళ్లను క్రికెట్ నుంచి నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ బలమైన సారథి అవసరమయ్యాడు. అదే సమయంలో బీసీసీఐ సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ పగ్గాలు అందించింది. ఇంకేముంది అంతర్జాతీయ క్రికెట్లో గంగూలీ టీమిండియాకు దూకుడు నేర్పించాడు. తన హాయాంలో ఎంతమంది యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు. హర్బజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, ధోని, సురేశ్ రైనా లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు గంగూలీ కెప్టెన్సీలో వెలుగులోకి వచ్చిన వారే.
2005-06 గ్రెగ్ ఛాపెల్ ఎరా
2005లో వ్యక్తిగత కారణాలతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకొనేందుకు కోచ్ జాన్రైట్ ఆసక్తి కనబర్చలేదు. దీంతో 2005, మేలో గ్రెగ్ టీమిండియా కోచ్గా ఎంపికయ్యాడు. ఛాపెల్ నేతృత్వంలో టీమిండియా తొలిసారి శ్రీలంకలో పర్యటించింది. అంతకుముందు సిరీస్లో స్లో ఓవర్రేట్ కారణంగా గంగూలీపై ఐసీసీ 6 మ్యాచుల నిషేధం విధించింది. దాంతో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో కూడా దాదా విఫలమయ్యాడు. వార్మప్ మ్యాచ్కు ముందు కెప్టెన్సీ వదిలేసి ఆటపై దృష్టి సారిస్తే ఫామ్లోకి వస్తావని ఛాపెల్ అతడితో చెప్పాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియా పద్ధతిలో ఫామ్లో ఉన్న 11 మందినే ఆడించాలని భావించిన ఛాపెల్, గంగూలీని తప్పించాడు. దీంతో తన కెప్టెన్సీకి ముప్పు తెస్తున్నాడని భావించిన గంగూలీ సిరిస్ నుంచి అర్ధాంతరంగా సిరీస్ నుంచి తప్పుకొని భారత్కు వచ్చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత 2007 వరల్డ్కప్లో టీమిండియా ఘోర ప్రదర్శన చేయడంతో ఛాపెల్ తన పదవికి రాజీనామా చేశాడు.
2007-08 పునరాగమనం ఆ తర్వాత రిటైర్మెంట్
టెస్టుల్లో సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్ విఫలం కావడంతో సౌరవ్ గంగూలీ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2007లో దాదా అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఆ ఏడాది 61.44 యావరేజితో 1106 టెస్టు పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాదు టెస్టు క్రికెట్లో దాదు డబుల్ సెంచరీని కూడా సాధించాడు. ఇక, 2008లో జరిగిన వన్డేల్లో దాదా చెలరేగాడు. 44.28 యావరేజితో 1240 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ముగిసిన తర్వాత దాదా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు అద్భుతమైన ఫామ్లో ఉన్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
2015 అడ్మినిస్ట్రేటర్గా కొత్త అవతారం
2015లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కు ప్రెసిడెంట్గా ఎంపిక చేశారు. 2018లో గంగూలీ రెండోసారి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కోసం 2013లో ఏర్పాటైన జస్టిస్ ముద్గల్ కమిటీలో గంగూలీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఇటీవలే మళ్లీ మూడోసారి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు.
2019 - బీసీసీఐ ప్రెసిడెంట్గా
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కు ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ క్రికెట్లో ఎన్నో సరికొత్త సంస్కరణలను తీసుకురావడంతో కీలకపాత్ర పోషించాడు. క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచీ బీసీసీఐ అధ్యక్షపదవి రేసులో గంగూలీ ఉన్నాడంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆ రూమర్లు నిజం కానున్నాయి. అక్టోబర్ 23న ముంబైలో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.