మరో 21 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మహా సమరంలో కప్ లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 దశకు చేరుకోవడం భారత్కు సులభమే. కానీ సూపర్-8 నుంచి సెమీఫైనల్స్, అక్కడ నుంచి టీమిండియా టైటిల్ సాధించడమే సవాలు.
మరోవైపు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. మ్యాచ్ విన్నర్లతో జట్టు అద్భుతంగా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కొనియాడితే, ఎంపిక చేసిన ఆటగాళ్లతో తుదిజట్టు కూర్పును సిద్ధం చేయడం కష్టమని మరికొందరు మాజీలు విమర్శిస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు.

యశస్వీ జైస్వాల్కు బదులుగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లిని ఓపెనర్గా పంపించాలని గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో ఓపెనర్గా పరుగుల వరద పారిస్తున్న కోహ్లి అదే స్థానంలో మెగాటోర్నీలో బరిలోకి దిగాలని అన్నాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 92 పరుగులు సాధించిన కోహ్లి ఇన్నింగ్స్ను దాదా కొనియాడాడు.
''విరాట్ అసాధారణంగా ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో అతడు అద్భుతంగా ఆడాడు. టీ20 వరల్డ్ కప్లో కోహ్లిని ఓపెనర్గా పంపాలి. భారత జట్టు గొప్పగా ఉంది. అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశారు. బ్యాటింగ్లో లోతుతో పాటు బౌలింగ్ కూడా ఎంతో బాగుంది'' అని గంగూలీ అన్నాడు.
అయితే గంగూలీ వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ విభేదించాడు. యశస్వీ జైస్వాల్ను ఓపెనర్గా పంపించాలని అన్నాడు. కుడి, ఎడమ చేతి వాటం బ్యాటర్లతో ఓపెనింగ్ జోడీ ఉండాలని అన్నాడు. ''జట్టు కూర్పులో ఏమైనా మార్పులు చేయాలని భావిస్తే, కోహ్లితో జైస్వాల్ను ఓపెనర్లుగా పంపించమని సలహా ఇస్తాను. రోహిత్ను నాలుగో స్థానంలో వెళ్లాలని సూచిస్తాను. ఆ స్థానంలో రోహిత్కు మెరుగైన రికార్డు ఉంది'' అని హెడెన్ పేర్కొన్నాడు.