
కోల్కతా: ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో రెండు నెలలకు పైగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్తో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే లాక్ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఎలాగూ మ్యాచులు, బాధ్యతలు లేవు కాబట్టి.. పలు ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఓ రెండు ఫొటోలు పోస్ట్ చేసారు.
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మరోసారి బాల్కనీలో కుస్తీ పట్టారు. అయితే ఈసారి మాత్రం తన మామిడి చెట్టుకోసం కుస్తీ పట్టారు. ఈ సమయంలో దాదా కూతురు, కొడుకు కూడా ఉన్నారు. పెరటిలో చెట్టుకి మామిడి కాయలు తెంపుకున్నారేమో తెలియదు కానీ.. చెట్టుకు తాడు కట్టి తన వైపు లాక్కుని వదిలేసారు. దీనికి సంబందించిన పోటోలను దాదా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
'ఇంటిలోని మామిడి చెట్టుని ఎత్తి, వెనక్కిలాగి దాని తిరిగి మాములు పరిస్థితిలో పెట్టడం జరిగింది. ఈసారి బలం గరిష్ట స్థాయికి చేరుకుంది' అంటూ సౌరవ్ గంగూలీ కాప్షన్ రాసుకోచ్చారు. బీసీసీఐ బాస్ అభిమానుల కోసం ఓ రెండు ఫొటోలను పంచుకున్నారు. మామిడిచెట్టు యధావిధిగా ఉన్న ఫొటో ఒకటి, లాగిన తర్వాత మరో ఫొటో ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దాదా భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు.
భారత క్రికెట్ స్థాయిని పెంచిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ విషయాన్ని అతడితో కలిసి ఆడిన ఆటగాళ్లతో పాటు మాజీలు కూడా ఒప్పుకుంటారు. 2000 నుంచి 2005 వరకు గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలు రాళ్లను చేరుకుంది. అప్పటి మేటి జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గంగూలీ భారత క్రికెట్ను మార్చిన గొప్ప ఆటగాడు. ఆయన కారణంగా భారత క్రికెట్కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. జట్టు సభ్యులను ఉద్రేకపూరితంగా మార్చడంలో దాదా సఫలీకృతుడయ్యారు. 2002లో నాట్వెస్ట్ సిరీస్లో మ్యాచ్ గెలువగానే చొక్కా విప్పి గాల్లో తిప్పడం ఒక్క గంగూలీకే చెల్లింది.
కరోనా వైరస్ సంక్షోభం సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)నీ లీడ్ చేసేందుకు సమర్థులు కావాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. అందుకు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే ఐసీసీ అధ్యక్షుడిగా సరైనోడు అని పేర్కొన్నాడు. ఐసీసీకి దాదా అధ్యక్షుడు కావాలని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బోర్డును గంగూలీ అద్భుతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే.