డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా పలువురు విమర్శలు చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, అశ్విన్ను పక్కన పెట్టడం వంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నందుకు రోహిత్ను ఫ్యాన్స్తోపాటు మాజీలు కూడా తిట్టిపోశారు.
ఇక ఈ మ్యాచ్ తొలి రోజు ఫీల్డ్ సెట్టింగ్లు, బౌలర్లను ఉపయోగించుకున్న తీరు కూడా విమర్శలపాలైంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ టెస్టు కెప్టెన్గా నిలిచిన విరాట్ కోహ్లీకి మళ్లీ టెస్టు జట్టు పగ్గాలు అందించాలని కొందరు డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గతేడాది అంటే 2022లో టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఆ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా గంగూలీ ఉన్నాడు. బోర్డుతో విభేదాల కారణంగానే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీ ఇలా టెస్టు కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నాడో బోర్డుకు కూడా తెలియదని గంగూలీ చెప్పాడు. అలాగే, కోహ్లీ రిజైన్ చేస్తాడని తామెవరూ ఊహించలేదన్నాడు.
కోహ్లీ నిర్ణయంతో బోర్డుకు ఏమాత్రం సంబంధం లేదని దాదా చెప్పాడు. 'కోహ్లీ తప్పుకుంటాడని మేం ఎవరం అనుకోలేదు. అతని నిర్ణయం తెలిసి షాకైపోయాం. అప్పుడు బెస్ట్ చాయిస్ రోహిత్ అని భావించి అతనికే టెస్టు కెప్టెన్సీ కూడా అప్పగించాం. అంతేకానీ, కోహ్లీ రాజీనామా విషయంలో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదు' అని గంగూలీ వివరించాడు.
'కోహ్లీ ఇలా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐ ప్రిపేర్ అయిలేదు. మాకది చాలా అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయం. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే చెప్పగలడు. అయినా అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకొని లాభం లేదు. అప్పట్లో కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్కు సెలెక్టర్లు ఈ బాధ్యతలు అప్పగించారు' అని గంగూలీ వెల్లడించాడు.