గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలు:
బీసీసీఐ అధ్యక్ష పదవిలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన వివాదాస్పదం కాకుండా సజావుగానే ముగిసింది. ఇక బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో.. దాదా ఈ రోజు బోర్డు పగ్గాలు చేపట్టనున్నాడు.
అధ్యక్ష పదవిలో 10 నెలలు:
బీసీసీఐ అధ్యక్ష పదవిలో గంగూలీ దాదాపు 10 నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగనున్నారు. ప్రస్తుతం కోల్కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, ఉత్తరాఖండ్కు చెందిన మాహిమ్ వర్మ ఉపాధ్యక్షుడిగా, కోశాధికారిగా అరుణ్ ధూమల్, జాయింట్ సెక్రటరీగా జయేష్ జార్జ్ ఎన్నికకానున్నారు.
తప్పుకోనున్న సీఓఏ కమిటీ:
33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. సీఓఏ కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ తమ పదవీ కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. అధ్యక్ష పదవి చేపట్టాక మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవిష్యత్ గురించి అతడితో, సెలక్టర్లతో మాట్లాడతానని గంగూలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
1992లో అరంగేట్రం:
గంగూలీ కెరీర్లో 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసాడు. గంగూలీ కెరీర్ 1996లో టెస్ట్ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్ చీఫ్గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.