రెండో కెప్టెన్గా సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో కెప్టెన్గా సౌరవ్ గంగూలీ అరుదైన ఘనత సాధించాడు. సౌరవ్ గంగూలీ కంటే ముందు మహారాజా ఆఫ్ విజయనగరంగా పిలవబడే ఏకేఏ విజ్జీ అటు భారత జట్టు కెప్టెన్గా ఇటు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1936 ఇంగ్లాండ్ పర్యటనలో ఏకేఏ విజ్జీమూడు టెస్టులకు సారథ్యం వహించారు.
1954లో బీసీసీఐ అధ్యక్షుడిగా
ఆ తర్వాత ఆయన 1954లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం 2014లో తాత్కాలిక ప్రెసిడెంట్గా ఎన్నిక అయినప్పటికీ... పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మాత్రం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్గా గంగూలీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవం
ఆ సమయంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవంలో ఉంది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ పెద్ద కుదుపు కుదిపింది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ తనదైన శైలిలో దూకుడు నేర్పించి టీమిండియా విదేశాల్లో సైతం టెస్టులు నెగ్గగలదని నిరూపించాడు. తాజాగా అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
క్యాబ్ అధ్యక్షుడిగా
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కు ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ క్రికెట్లో ఎన్నో సరికొత్త సంస్కరణలను తీసుకురావడంతో కీలకపాత్ర పోషించాడు. క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచీ బీసీసీఐ అధ్యక్షపదవి రేసులో గంగూలీ ఉన్నాడంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి.
అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షునిగా
ఇన్నాళ్లకు ఆ రూమర్లు నిజయమవుతున్నాయి. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు అందుకోవడం సవాలేనని గంగూలీ అన్నాడు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూనిట్లు మద్దతు తెలపడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని గంగూలీ తెలిపాడు.