డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. దీంతో ఫ్యాన్స్, నిపుణులు అంతా టీమిండియా ఆటతీరు, ఈ మ్యాచ్కు రెడీ అయిన విధానంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వల్లనే టీమిండియా ఓడిపోయిందని కొందరు అన్నారు. ఐపీఎల్ వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్కు రెడీ అవడానికి టీమిండియా ఆటగాళ్ల వద్ద సరిగా టైం లేకుండా పోయిందని ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా అందరూ ఐపీఎల్ను ఆడిపోసుకుంటున్న సమయంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ గెలవడం చాలా కష్టమని, దాని కన్నా వరల్డ్ కప్ గెలవడం చాలా ఈజీ అని గంగూలీ అన్నాడు. 'వరల్డ్ కప్ గెలవడం కన్నా ఐపీఎల్ గెలవడం చాలా కష్టం. ఐపీఎల్లో 14 మ్యాచులు ఆడాలి. ఆ తర్వాత ప్లేఆఫ్స్ ఆడతాం' అని చెప్పాడు.

'అదే వరల్డ్ కప్లో అయితే 4-5 మ్యాచులు ఆడితే చాలు సెమీఫైనల్, ఫైనల్ చేరిపోవచ్చు. కాబట్టి ఐపీఎల్ గెలవడమే కష్టం' అని గంగూలీ వివరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ముందు భారత ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్ ఆడిన సంగతి తెలిసిందే. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అజింక్య రహానే, శుభ్మన్ గిల్, కేఎస్ భరత్ తదితరులు ఐపీఎల్ ఫైనల్ కూడా ఆడారు.
ఈ మ్యాచ్ రిజర్వ్ డే రోజున జరిగింది. దీంతో వీళ్లు ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఎక్కువ సమయం దక్కలేదు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లు మే 26న జరిగిన రెండో క్వాలిఫైయర్ వరకు భారత్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. అదేంటంటే.. గత డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు భారత ఆటగాళ్లు ఐపీఎల్లో లేరు.
కరోనా కారణంగా ఐపీఎల్ రద్దవడంతో.. భారత ఆటగాళ్లకు చాలా తీరిక దొరికింది. అయితే వాళ్లను ఇంగ్లండ్కు మాత్రం బీసీసీఐ త్వరగా పంపలేదు. జూన్ 18న మ్యాచ్ ఉంటే.. టీం మొత్తాన్ని జూన్ 3న ఇంగ్లండ్ పంపింది. అప్పుడు కూడా సరిగా ప్రిపేర్ అవ్వకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. మరి ఈ తప్పుల నుంచి గుణపాఠాలే నేర్చుకొనైనా బీసీసీఐ ఇకపై సరైన నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.