
దక్షిణాఫ్రికా సిరీస్కు కొత్త కమిటీ:
సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని పాత కమిటీ ఇప్పటికే తుది జట్టును ఎంపిక చేసింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్కు కొత్త ఛైర్మన్తో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది' అని గంగూలీ స్పష్టం చేశారు. 'ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా స్థానాలకు.. లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్, రాజేశ్ చౌహన్, వెంకటేశ్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. త్వరలోనే కొత్త సభ్యులకు ముఖాముఖి నిర్వహిస్తాం' అని దాదా చెప్పారు.

గంభీర్కు నో ఛాన్స్:
క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)పై కూడా గంగూలీ స్పందించారు. 'గతంలో పేర్కొన్నట్లుగా మదన్ లాల్, సులక్షణ నాయక్ కొనసాగుతారు. అయితే గౌతమ్ గంభీర్ స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీకి ఎంపీగా కొనసాగుతున్న కారణంగా అతడికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ఆటంకంగా మారుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని దాదా తెలిపారు.

పాండ్యా ఫిట్నెస్ సాధించలేదు:
'ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా పునరాగమనం ఆలస్యం కావొచ్చు. శస్త్ర చికిత్స తర్వాత పాండ్యా ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. పాండ్యా ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడలేడు. అతడికి తగినంత సమయం అవసరం. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా' అని మాజీ కెప్టెన్ ధీమా వ్యక్తం చేసారు. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు జరిగే ఐపీఎల్ టోర్నీలో ఎప్పటిలాగే రాత్రి మ్యాచ్లు 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని సౌరవ్ చెప్పారు.

ముంబైలో ఫైనల్:
మే 24న ముంబైలో ఫైనల్ నిర్వహించాలని సోమవారం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నోబాల్ నిర్ణయాన్ని మూడో అంపైర్ తీసుకోనుండగా, గాయపడిన ఆటగాడి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ను తొలిసారి ప్రవేశపెట్టారు. విరాళాల సేకరణ కోసం లీగ్ ఆరంభానికి ముందే ఐపీఎల్ ఆల్ స్టార్స్ మ్యాచ్ను నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications












