
హైదరాబాద్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్లో తనకు అకౌంట్ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. "నా పేరిట ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నకిలీది. ఆ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన వార్తలు గానీ, కోట్స్ గానీ దయచేసి ఎక్కడా వాడకండి. ఇన్స్టాగ్రామ్ టీమ్కి ఈ విషయం గురించి వెంటనే రిపోర్టు చేస్తా" అని గంగూలీ ట్వీట్ చేశాడు.
వివరాల్లోకి వెళితే... sganguly99 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టుల ఆధారంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ను, కెప్టెన్ విరాట్ కోహ్లీని విమర్శిస్తూ గంగూలీ వ్యాఖ్యలు చేశాడంటూ పలు జాతీయ మీడియా చానళ్లలో వార్తలు వచ్చాయి.
దీంతో ఆ అకౌంట్ నకిలీదని తాజాగా సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏముందంటే... "టెస్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఒక్కరూ పరుగులు చేయాల్సి ఉంటుంది. కోహ్లీ బాగా ఆడకపోయి ఉంటే రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్కు ముగింపు పడేది" అని దాదా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాదు "కెప్టెన్గా ఉన్న కారణంగా నువ్వు(కోహ్లీ) విమర్శలు ఎదుర్కోక తప్పదు. విజయం వరించినపుడు ఆనందించడమే కాదు అపజయాన్ని కూడా స్వీకరించాలి" అంటూ కోహ్లీని ట్యాగ్ చేస్తూ దాదా పేరిట ఉన్న అకౌంట్ నుంచి వచ్చిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఆ అకౌంట్కు 55.3 వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ విఫలం కావడంతో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది.