ఎంతసేపని గదిలోనే ఉంటారు
టీమిండియా కోచ్ రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ పత్రికతో దాదా మాట్లాడుతూ... 'ఎవరైనా ఎంతసేపని హోటల్ గదిలో ఉంటారు. మీరు ఒక రోజు మొత్తం ఇంట్లో, మరోరోజు మొత్తం బయట ఉండగలరా. ఎవరైనా హోటల్ గదిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆపలేం. అది జరగని పని కూడా.
నేను తాజాగా ఒక షూటింగ్లో పాల్గొన్నా. అక్కడ 100 మంది ఉన్నారు. అందరూ డబుల్ డోస్ వాక్సిన్ తీసుకున్నారు. అయినా ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. వాక్సిన్ తీసుకున్నా.. చాలా మంది వైరస్బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇలా ఉంది' అని అన్నాడు.
ప్లేయర్స్ ఆందోళనకు గురయ్యారు
ఐదవ టెస్టును రద్దు చేయడంలో ఐపీఎల్ 2021 పాత్ర ఉందా? అని సౌరవ్ గంగూలీని అడిగినప్పుడు.. 'లేదు. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎవరికీ నష్టం వాటిల్లే విధంగా బీసీసీఐ వ్యవహరించదు' అని గంగూలీ అన్నాడు. 'ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ప్లేయర్స్ నిరాకరించారు. కానీ వాళ్లను కూడా ఈ విషయంలో నిందించలేం.
ఫిజియో యోగేశ్ పార్మర్ అప్పటికే ప్లేయర్స్తో టచ్లో ఉన్నాడు. నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్లోకి వెళ్లిన తర్వాత యోగేశ్ ఒక్కడే సహాయ బృందంలో మిగిలిపోయాడు. యోగేశ్ ప్రతి రోజూ ఆటగాళ్లకు మసాజ్ చేసేవాడు. అతనికి కరోనా సోకిందని తెలియగానే.. ప్లేయర్స్ అందరూ ఆందోళనకు గురయ్యారు. తమకూ కరోనా సోకుతుందని భయపడ్డారు' అని దాదా వెల్లడించాడు.
IPL 2021: నాలాంటి ముసలోడు.. కుర్రాళ్లతో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలి: ఆర్సీబీ స్టార్ ప్లేయర్
సమయం వచ్చినప్పుడు చూద్దాం
టీ20 వరల్డ్కప్ 2021తో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తోంది. తాను పొడిగింపు కోరనని శాస్త్రి స్పష్టం చేశాడు. దీంతో ఇప్పటికే శ్రీలంక టూర్లో టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడే తర్వాత హెడ్ కోచ్ కావడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ది వాల్ నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ కావడంతో ఆ వార్తలకు తెరపడింది. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. 'శాశ్వత ప్రాతిపదికన ఈ పదవి తీసుకోవడానికి ద్రవిడ్ ఆసక్తి చూపడం లేదన్న విషయం నాకు తెలుసు. అయితే దీని గురించి అతన్ని మేము ప్రత్యేకంగా అడగలేదు. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం' అని గంగూలీ పేర్కొన్నాడు.
వరల్డ్కప్కు మాత్రమే
ఇక టీ20 వరల్డ్కప్కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మెంటార్గా పంపించడంపైనా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ ఆలోచన ఎవరిది అని ప్రశ్నించగా.. 'అది ఎవరిది అన్నదాంతో సంబంధం లేదు. ఇండియన్ టీమ్ విజయవంతం కావడమే ముఖ్యం. అంతేకాదు ఎంఎస్ ధోనీ కేవలం టీ20 వరల్డ్కప్కు మాత్రమే మెంటార్గా ఉంటాడు. తర్వాత ఉండబోనని ధోనీ మాకు తేల్చి చెప్పాడు' అని కూడా దాదా వెల్లడించారు. ఇంగ్లండ్తో ఐదో టెస్టు రైద్దెనందుకు తాము తీవ్ర నిరాశకు గురయ్యామని, వచ్చే ఏడాదిలో మరో రెండు టీ20లు ఆడేందుకు సిద్ధముగా ఉన్నామని దాదా పేర్కొన్నాడు.