
ఐఎస్ఎల్ ఓ ప్రేరణ:
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'కరోనా నేపథ్యంలో ఎన్నో సవాళ్లు విసిరే సమయంలోనూ సుదీర్ఘ కాలం కొనసాగే క్రీడలను విజయవంతంగా నిర్వహించగలదని భారత్ ప్రపంచానికి నిరూపించింది. దేశంలో మరెన్నో క్రీడల్ని పూర్తి స్థాయిలో ఆరంభించేందుకు ఐఎస్ఎల్ ఓ ప్రేరణగా నిలిచింది. లీగ్ నిర్వహణ భారత క్రీడా పరిశ్రమలోనే సరికొత్త గీటురాయిని నెలకొల్పింది' అని అన్నారు. ఇటీవల దాదా రెండోసారి స్టెంట్ వేసుకుని కోలుకున్న విషయం తెలిసిందే.

ఇదో గొప్ప విజయం:
'నిర్వాహకులు ఘన కార్యాన్ని నెత్తిన పెట్టుకున్నారు. చుట్టుపక్కల ఉన్న అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుని గొప్పగా టోర్నీ నిర్వహించారు. గత 6 నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇదో గొప్ప విజయం' అని ఏటీకే మోహన్ బగాన్ సహ యజమాని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. 'కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మన జీవితాల్లోకి ఫుట్బాల్ను తీసుకొచ్చేందుకు ఎంతో ధైర్యం, అంకితభావం, ప్రణాళిక అవసరం అయ్యాయి' అని ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ నీతా అంబానీ చెప్పారు. నీతా అంబానీకి క్రీడలంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే.

బుడగల కోసమే రూ.17 కోట్లు:
గోవాలో నిర్వహించిన ఐఎస్ఎల్ ఏడవ సీజన్లో ముంబై ఎఫ్సీ విజేతగా.. ఏటీకే మోహన్ బగాన్ రన్నరప్గా నిలిచింది. గతేడాది నవంబర్ 20న ఆరంభమైన ఏడో సీజన్.. మార్చి 14న ముగిసింది. 11 జట్లు 115 మ్యాచుల్లో తలపడగా.. 298 గోల్స్ నమోదయ్యాయి. సీజన్ను నిరంతరాయంగా కొనసాగించేందుకు నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం గోవాలో 1600 మందితో 14 హోటళ్లలో 18 బయో బుడగలను సృష్టించారు. 70వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. బుడగల కోసమే ఏకంగా రూ.17 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక మైదానాలను కొత్తగా అభివృద్ధి చేశారు.

త్వరలోనే ఐపీఎల్ 2021:
త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమై.. మే 30న ముగుస్తుంది. 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్లో మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈ ఏడాది అక్టోబర్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది.


Click it and Unblock the Notifications
