
షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్:
ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా టీ20 మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కోల్కతాలో గురువారం గంగూలీ పూర్తి స్పష్టత ఇచ్చారు. 'ఢిల్లీ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఉంటుంది' అని దాదా తేల్చాసారు. దీంతో కాలుష్యం, పొగమంచు అధికంగా ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరగనుంది.

భవిష్యత్తులో ఢిల్లీ షెడ్యూల్పై ఆలోచిస్తాం:
గంగూలీ మాట్లాడుతూ... 'గత రెండు రోజులుగా డిల్లీ అధికారులతో మాట్లాడాం. గ్రౌండ్మెన్లతో మాట్లాడా. సూర్యుడు వచ్చిన తర్వాత బాగానే ఉంటుందన్నారు. మ్యాచ్ జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. చివరి నిమిషంలో వేదికను మార్చడం కుదరదు. శీతాకాలం సమయంలో ఉత్తర భారతదేశంలో పొగ, దుమ్ము, మంచు అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మ్యాచ్లు షెడ్యూల్ చేసేటపుడు భవిష్యత్తులో ఆలోచిస్తాం. సరైన ప్రణాళిక సిద్ధం చేయాలి. మ్యాచ్లపై మరింత ప్రాక్టీకల్గా ఉండాలి' అని గంగూలీ తెలిపారు.

తొలి టీ20కి ఎలాంటి సమస్య లేదు:
భారత పర్యటన కోసం బంగ్లాదేశ్ ఆటగాళ్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సందర్భంగా లిటన్ దాస్ మాస్కు ధరించాడు. 'వాయు కాలుష్యం వల్ల ఇబ్బందితో మాస్క్ వేసుకోలేదు. వ్యక్తిగత సమస్యవల్లే మాస్క్ వేసుకున్నా. మ్యాచ్ ఫ్లడ్లైట్ల కింద జరుగుతున్నందున బంతి కనిపించకపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు' అని దాస్ అభిప్రాయపడ్డాడు. తొలి టీ20కి ఎలాంటి సమస్య లేదని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

లంక క్రికెటర్లకు వాంతులు:
ఢిల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు సైతం ఇబ్బందులు పడ్డారు. 2017లో కాలుష్యం తట్టుకోలేని కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా.. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అది టెస్టు మ్యాచ్ కావడంతో లంక క్రికెటర్లు ఐదు రోజులు బాధను భరించారు. ఇప్పటివరకూ కూడా ఢిల్లీలో ఏమీ మార్పులు రాలేదు.


Click it and Unblock the Notifications












