
న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించినట్లు ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడటం అసాధ్యమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఆసీస్తో భారత్ నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. అయితే సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ మాత్రం ఈ సిరీస్ను ఐదు మ్యాచ్లకు పెంచాలని ప్రతిపాదించారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం దీనికి ససేమిరా అంటున్నాడు.
శుక్రవారం సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుందని అనుకోవడం లేదు. ఈ సిరీస్తో పాటు మూడు వన్డే మ్యాచ్లు కూడా ఆడాల్సి ఉంది. ఇక ప్రమాదకర కరోనా వైరస్ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండాలి. దీనికి తోడు మరో టెస్టు అదనంగా ఆడిస్తే.. ఈ టూర్ను మరింతకాలం పొడిగించాల్సి ఉంటుంది' అని వివరించాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ అడిలైడ్ ఓవల్ మైదానంలోనే జరిగే అవకాశాలు లేకపోలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ తెలిపాడు.
ఈ ఏడాది ఐపీఎల్ 2020 జరిగితే భారత ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించే అవకాశం లేదని గంగూలీ తెలిపాడు. ఒకవేళ ఐపీఎల్ 13వ సీజన్ జరగకపోతే రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, తద్వారా ఆటగాళ్ల జీతాల్లో కోతల గురించి ఆలోచించాల్సి ఉంటుందన్నాడు. 'బోర్డు ఆర్థిక పరిస్థితి గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత డబ్బు ఉందో తెలుసుకున్నాక ఆటగాళ్ల జీతాల్లో కోత గురించి ఓ నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ జరగకపోతే.. రూ.4 వేల కోట్ల భారీ నష్టం వాటిల్లనుంది. ఒకవేళ ఐపీఎల్ సీజన్ జరిగితే మాత్రం ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించం' అని గంగూలీ పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని పాలించే సరైన నాయకత్వ లక్షణాలు సౌరవ్ గంగూలీకి ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కితాబిచ్చారు. ఐసీసీ కన్నా బీసీసీఐ అధ్యక్షునిగా రాణించడమే కఠినమైనదని అన్నారు. 'బీసీసీఐని నడిపించాలంటే ఎంతో సమర్థత ఉండాలి. పరపతితో పాటు రాజకీయాలతో తెలివిగా వ్యవహరించాలి. సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాలి. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటున్న గంగూలీ.. ఏదో ఒక రోజు ఐసీసీని నడిపించగలడు. నిజం చెప్పాలంటే ఐసీసీ కన్నా బీసీసీఐని పాలించడమే కష్టం' అని డేవిడ్ చెప్పుకొచ్చారు.