ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ జరుగుతుందని నెల క్రితమే ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. అధికారిక షెడ్యూల్ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దానికి ప్రధాన కారణం ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న దుబాయ్, షార్జా, అబుదాబీల్లో వైరస్ రూల్స్ కఠినంగా ఉండడమే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చెందిన 13 మంది కరోనా బారిన పడడం కూడా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలను మరింత ఆలస్యం చేసింది.
ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ శుభవార్తను అందించారు. సెప్టెంబర్ 4న (శుక్రవారం) ఐపీఎల్ 2020 షెడ్యూల్ను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 'సెప్టెంబర్ 4న ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేయనుంది' అని ఓ న్యూస్ వెబ్సైట్తో సౌరవ్ అన్నారు.
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఆరంభ మ్యాచ్ ఆడాలి. కరోనా కేసులు రావడంతో క్వారంటైన్లో ఉండటంతో చెన్నై టీమ్ ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆటగాళ్లు సాధన చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టోర్నీ ఆరంభ మ్యాచ్లో చెన్నై స్థానంలో మరో టీమ్కు అవకాశం ఇవ్వనున్నారు.
షెడ్యూల్లో తొలి మ్యాచ్ నుంచి చెన్నై టీమ్ను తప్పించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఛాన్స్ ఇస్తారని సమాచారం. మొదటి మ్యాచ్లో మైదానంలో స్టార్ ఆటగాళ్లతో లీగ్ ఆరంభించాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ముంబై, చెన్నై తర్వాత బెంగళూరు టీమ్కే అభిమానుల్లోక్రేజ్ ఎక్కువ. ఒకవేళ చెన్నై ఆడకపోతే.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టును తొలి మ్యాచ్కు ఎంపిక చేయాలనుకుంటున్నారు.
CSK: రైనా లేడుగా ఈసారి వైస్ కెప్టెన్ ఎవరు.. నెటిజన్కు అదిరే పంచ్ ఇచ్చిన సీఎస్కే!!