
హైదరాబాద్: లార్డ్స్ బాల్కనీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీ షర్ట్ తీసి గాల్లోకి ఊపిన ఆ సంఘటన అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసింది. నాట్వెస్ట్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 326 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించి ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయానంతరం గంగూలీ లార్డ్స్ బాల్కనీలో టీ షర్ట్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ గాల్లోకి ఊపిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలోనే అభిమానులు ఈ సంఘటనను ఓ అపురూపమైనదిగా భావిస్తుంటారు. అలాంటి సంఘటనపై వెటరన్ జర్నలిస్ట్ బర్కాదత్కు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
'ప్రతి ఒక్కరూ అదొక గొప్ప మూమెంట్గా చెబుతారు. కానీ, నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే నేను సాంప్రదాయమైన బెంగాలీ కుటుంబం నుంచి వచ్చాను. ఆ ఉత్కంఠ క్షణాల్లో అలా జరిగింది. నేను ఆడే సమయంలో క్రికెట్ను చూసే విధానం భిన్నంగా ఉండేది' అని గంగూలీ వెల్లడించాడు.
త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ 'ఎ సెంచరీ ఇజ్ నాట్ ఎన్ఫ్' పుస్తక ప్రమోషన్లో భాగంగా గంగూలీ అనేక విషయాలను బర్కాదత్తో పంచుకున్నాడు. 'మైదానంలో జట్టుకు నేతృత్వం వహిస్తున్నప్పుడు కాస్తంత దూకుడుగా వ్యవహారించాల్సి ఉంటుందని, అదే మైదానం బయట చాలా వేరే విధంగా ఉంటుంది. ప్రతి క్రికెట్ మ్యాచ్ కూడా గెలవాలనే తపన ఉంటుంది' అని దాదా తెలిపాడు.
2002లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన నాట్వెస్ట్ ముక్కోణపు సిరిస్లో టీమిండియా విజయం సాధించడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టంగా అభిమానులు భావిస్తారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ (115) పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా యువరాజ్ సింగ్ (69), మహమ్మద్ కైఫ్ (87 నాటౌట్) పరుగులతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషంచారు. చివరకు వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ మూడు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
ఇక, తన క్రికెట్ కెరీర్లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపల్ను కావాలని కోచ్గా నియమించుకోవడమేనని అన్నాడు. తనను కెరీర్ పరంగా చాలా ఎక్కువ కష్టాలు గురి చేశాడని అన్నాడు. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుని నియంతలా వ్యవహరించేవాడని చెప్పుకొచ్చాడు.
ఎవరి మాట వినిపించుకోకుండా అతన్ని కోచ్గా చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని గంగూలీ తెలిపాడు. దాదాపు రెండేళ్లు పాటు భారత క్రికెట్ జట్టుకు కోచ్గా పని చేసిన చాపెల్తో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు దాదా ఈ సందర్భంగా తెలిపాడు. చాపెల్ కోచ్గా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే తన కెప్టెన్సీ పోయిందని గంగూలీ పేర్కొన్నాడు.