హైదరాబాద్: మంగళవారం బీసీసీఐ బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మీడియా ప్రశ్నించగా అతడు స్పందించేందుకు నిరాకరించాడు.
భరత్ అరుణ్ ఎంపికపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని గంగూలీ స్పష్టం చేశాడు. "ఈ విషయంలో ఇప్పటివరకు చెప్పింది చాలు. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు" అని గంగూలీ కోల్కతాలో విలేకరులతో అన్నాడు.

వివరాల్లోకి వెళితే... సౌరవ గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం జులై 10న ముంబైలో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సచిన్, గంగూలీల మధ్య బౌలింగ్ కోచ్ ప్రస్తావన కూడా వచ్చింది.
బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ నియామకానికి అంగీకారం తెలిపితేనే ప్రధాన కోచ్ పదవి కోసం రవిశాస్త్రికి మద్దతు తెలుపుతా? అని గంగూలీ అన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంతోనే రవిశాస్త్రిని కోచ్గా ఎంపిక చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.
అయితే ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఎంపిక అయిన తర్వాత కథ అడ్డం తరిగింది. తనకు జట్టు వెంబడి పూర్తిస్థాయిలో ఉంటే బౌలింగ్ కోచ్ కావాలని తెరపైకి భరత్ అరుణ్ పేరుని తీసుకొచ్చాడు. దీనిపై బీసీసీఐ పరిపాలనా కమిటీ కూడా రవిశాస్త్రికే మద్దతుగా నిలిచింది.
జహీర్ ఖాన్ని విదేశీ పర్యటనలకు కన్సల్టెంట్గా మాత్రమే తీసుకున్నామని, పూర్తిస్థాయి కోచ్గా కాదు అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత రవిశాస్త్రి కోరిక మేరకు భరత్ అరుణ్ని బౌలింగ్ కోచ్గా నియమించింది. దీంతో భరత్ అరుణ్ ఎంపికపై అసంతృప్తిగా ఉన్న గంగూలీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించాడు.