హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ.. అంటే ఇప్పటికీ క్రికెట్లో వైబ్రేషన్. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటిన తొలి టీమిండియా కెప్టెన్ గంగూలీయే. జట్టుకు నాయకత్వం వహించి ధోనీలాంటి యువకెరటాలను అందిపుచ్చుకున్న సమర్థవంతమైన నాయకుడు. కొద్ది నెలల క్రితం 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' ఎన్ని పొందుపరచినప్పటికీ అతని మాటల్లో ఇంకా గతం తాలూకూ విషయాలు కొత్తగానే వినిపిస్తాయి.
ఇటీవల ఓ మీడియా ఛానెల్కు బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్తో జరిపిన ఇంటర్వ్యూలో మరో సరికొత్త విషయాన్ని వెల్లడించాడు. 'అండర్-15కు ఆడే సమయంలో నేను, సచిన్, వినోద్ కాంబ్లి చెన్నైలోని ఎమ్ఆర్ఎఫ్ పేస్ అకాడమీలో శిక్షణకు వెళ్లాం. ఐతే, ఒకరోజు నేను నిద్రపోయి లేచే సరికి నా గది అంతా నీటితో మునిగిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. బాత్రూంలో నీటి పంపు విరిగిందేమో, అందుకని నీళ్లంతా గదిలోకి వచ్చి ఉంటాయని అనుకున్నా. అలా అనుకుంటూ వెళ్లి మా గది తలుపు ఓపెన్ చేశా. అప్పుడు అర్థమైంది.'
' సచిన్-కాంబ్లి ఇద్దరూ కలిసి బకెట్లో నీళ్లు తీసుకువచ్చి గదిలో పోశారని. ఎందుకు ఇలా చేశారని అడిగితే... మధ్యాహ్న సమయంలో ఎందుకు పడుకున్నావ్. ప్రాక్టీస్కు వెళ్దాం పద అన్నాడు. సచిన్ ఆ రోజు టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయడానికి పిలిచాడు. కానీ, వెళ్లకుండా , నేను మధ్యమధ్యలో విరామం తీసుకునే వాడిని. తనేమో రోజంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. మేనేజర్ వాసు పరంజాబె కూడా సచిన్ను బలవంతంగా నెట్స్ నుంచి బయటకు పంపేవాడు.'
'సచిన్కు నిద్రలో లేచి నడిచే అలవాటు కూడా ఉండేది. క్రమంగా అది తగ్గిపోయింది. ఏదైనా మ్యాచ్కు ముందు రోజు రాత్రి సచిన్ నిద్రపోయేవాడు కాదు. 1992లో ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో సచిన్ 148 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ ముందు రోజు మధ్య రాత్రిలోనే సచిన్ నిద్ర లేచాడు. పడుకోవచ్చు కదా అని అడిగితే.. ఈ రోజు బ్యాటింగ్ చేయాలి. నిద్రపట్టడం లేదని చెప్పాడు' అని దాదా వివరించాడు. ప్రస్తుతం గంగూలీ ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు గంగూలీ కామెంటేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.